KTR : హిండెన్‌బర్గ్‌ నివేదికపై కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ ప్రశ్నలు

హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌(KTR) కేంద్ర ప్రభుత్వానికి ట్విటర్‌ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు.

Updated : 28 Jan 2023 18:38 IST

హైదరాబాద్‌ :  అదానీ గ్రూప్‌పై అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌(KTR) స్పందించారు. కేంద్ర ప్రభుత్వానికి ట్విటర్‌ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. 

అదానీ గ్రూప్‌ స్టాక్‌ల్లో ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ సంస్థలు రూ.77 వేల కోట్లు, రూ.80 వేల కోట్లు ఎందుకు పెట్టాయి..? ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ సంస్థలను అలా నెట్టిందెవరు? ఈ మొత్తం వ్యవహారంలో వారికి ఎవరు సహాయం చేశారు? అంటూ పలు ప్రశ్నలు సంధించారు. సమాధానం చెప్పాల్సిన తీవ్రమైన ప్రశ్నలు ఇవి అంటూ కేటీఆర్‌ పేర్కొన్నారు. హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ చేసిన ఆరోపణలు అదానీ గ్రూపు షేర్లను కుదిపేస్తున్న విషయం తెలిసిందే.

స్టాక్‌ మార్కెట్లలో షేర్ల పతనంపై కేంద్రం సమాధానమివ్వాలి: ఎమ్మెల్సీ కవిత

స్టాక్‌ మార్కెట్‌లో ఒడుదొడుకులు, షేర్ల పతనం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. స్టాక్ మార్కెట్‌ ఒడుదొడుకులపై ఆమె ట్విటర్ ద్వారా స్పందించారు. అదానీ గ్రూప్‌ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని.. ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ హిండెన్‌బర్గ్‌ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నివేదిక వెల్లడైన తర్వాతే ఎల్ఐసీ, ఎస్‌బీఐ, ఇతర కంపెనీల షేర్లలో తగ్గుదల, ఒడుదొడుకులు తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నాయని కవిత పేర్కొన్నారు. ఈ పరిణామాలపై ప్రతీ ఒక్క భారతీయుడికి సమాధానం చెప్పాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉందన్నారు. దీనిపై నెలకొన్న అన్ని సందేహాలను నివృత్తి చేయాలన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సెబీ చీఫ్ మాధవి పూరీ బుచ్‌ దిద్దుబాటు చర్యలు ప్రారంభించేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన మిలియన్ల మంది పెట్టుబడిదారులు, వారిపై ఆధారపడిన కుటుంబాలతో ప్రభుత్వం తరఫున మాట్లాడాలని కవిత విజ్ఞప్తి చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు