KTR: టాలెంట్‌ అనేది ఎవడబ్బ సొత్తు కాదు: మంత్రి కేటీఆర్‌

విద్యార్థులు ఆలోచనలకు పదును పెడితే ప్రపంచమే అబ్బురపోయేలా ఆవిష్కరణలు చేయవచ్చని ఐటీ, 

Published : 23 Sep 2022 02:23 IST

సిరిసిల్ల: విద్యార్థులు ఆలోచనలకు పదును పెడితే ప్రపంచమే అబ్బురపోయేలా ఆవిష్కరణలు చేయవచ్చని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జరిగిన ‘గిఫ్ట్‌-ఏ-స్మైల్‌’ కార్యక్రమానికి గురువారం ఆయన హాజరయ్యారు. శాంసంగ్‌, ఆకాశ్‌ బైజూస్‌ సంస్థలు కళాశాల విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు అందజేసేందుకు ముందుకొచ్చాయి. గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమంలో భాగంగా తొలి రెండు విడతల్లో అంబులెన్స్‌లు, త్రిచక్ర వాహనాలను అందించగా.. మూడో విడతలో ఆకాశ్‌ బైజూస్‌ సంస్థలు విద్యార్థులకు ట్యాబ్‌లు అందించాయి. వీటిని మంత్రి కేటీఆర్‌ కళాశాల విద్యార్థులకు పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ..  ప్రపంచంతో పోటీపడుతూ విద్యార్థులు చదువు సాగించాలన్న మంత్రి కేటీఆర్‌.. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుంటే తప్పకుండా విజేతలుగా నిలుస్తారన్నారు. ఆవిష్కరణల్లో రాణించాలనుకునేవారిని  ప్రోత్సహించేందుకు  ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని తెలిపారు.  ‘‘టాలెంట్‌ అనేది ఎవడబ్బ సొత్తు కాదు. హైదరాబాద్‌లోని ఇంగ్లిష్‌ స్కూళ్లలో చదువుకున్న వారికి మాత్రమే టాలెంట్‌ ఉంది..  మనకు లేదని కాదు. తెలివి అందరికీ ఉంటుంది. వనరులన్నప్పటికీ వాటిని వాడుకుని జీవితంలో ఎలా ఎదుగుతామనేది మన చేతుల్లో ఉన్న సవాల్‌. ఆలోచన ఉంటే దానికి పదును పెడితే ప్రపంచాన్నే అబ్బురపరిచే సత్తా విద్యార్థులందరికీ ఉంది. ఎవరికంటే మనం తక్కువ కాదు. ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారుకావాలి’’ అని ఆకాంక్షించారు. 

కొట్లాడైనా చదువుకోవాలి.. 

‘‘ముఖ్యంగా అమ్మాయిల చదువు అయిపోయాక తల్లిదండ్రులు వారికి పెళ్లిచేయాలని చూస్తారు.  అలా కానివ్వొద్దు. కొట్లాడైనా సరే చదువుకోవాలి.  ఇవి పాత రోజులు కాదు. ఉద్యోగం కావాలనుకున్నవాళ్లు ఉద్యోగం సాధించవచ్చు. పరిశ్రమ పెడతా.. నేనే పది మందికి ఉద్యోగలిస్తాం అనుకునే వాళ్ల కోసం టీ హబ్‌, వీ హబ్‌, టీఎస్‌ఐసీ, టాస్క్‌ లాంటి సంస్థలన్నీ సిద్ధంగా ఉన్నాయి. పది మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి విద్యార్థులంతా ఎదగాలని.. ఉన్నత విద్యలో కలెక్టర్లు, డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లుగా  భవిష్యత్తులో ఉజ్వలంగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. అందరితోపాటు నాపై పోటీ చేసే ఇతర పార్టీ నాయకులు ఒకటే చెబుతున్నా.. మంచి పనులు చేద్దాం.. ప్రజల మనసులు గెలుద్దాం’’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని