KTR: మళ్లీ మేమే వస్తాం.. మరిన్ని సీఐఐ సదస్సులు నిర్వహిస్తాం: కేటీఆర్‌

హైదరాబాద్‌(Hyderabad)కు ఎన్నో అనుకూలతలు, బలాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌(KTR) అన్నారు. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని చెప్పారు. సీఐఐ(CII) తెలంగాణ సమావేశంలో ఆయన మాట్లాడారు. 

Updated : 07 Mar 2023 13:44 IST

హైదరాబాద్‌: ఫార్మా పరిశ్రమలకు ఒకేచోట అత్యుత్తమ వసతులు కల్పిస్తున్నామని తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌(KTR) అన్నారు. వ్యాపారులు, పెట్టుబడులకు రాష్ట్రంలో అద్భుతమైన వాతారణం ఉందని చెప్పారు. ప్రపంచ ప్రసిద్ధ సంస్థలు హైదరాబాద్‌(Hyderabad)లో తమ కేంద్రాలను ఏర్పాటు చేశాయన్నారు. అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అడోబ్‌ వంటి సంస్థలు అతిపెద్ద క్యాంపస్‌లను నగరంలో ఏర్పాటు చేశాయని ఆయన గుర్తుచేశారు. సీఐఐ(CII) తెలంగాణ వార్షిక సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని.. మరిన్ని సీఐఐ సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. 

‘‘2013తో పోలిస్తే రాష్ట్రంలో పెట్టుబడులు రెట్టింపయ్యాయి. 2030 నాటికి 250 బిలియన్‌ డాలర్లు సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. హైదరాబాద్‌కు ఎన్నో అనుకూలతలు, బలాలు ఉన్నాయి. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయి. 9 బిలియన్‌ టీకాలు నగరంలో ఉత్పత్తి అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయ్యే టీకాల్లో 50 శాతం హైదరాబాద్‌లోనే తయారవుతాయి. ఫార్మా పరిశ్రమలకు ఒకేచోట అత్యుత్తమ వసతులు కల్పిస్తున్నాం. సుల్తాన్‌పూర్‌ వద్ద అతిపెద్ద మెడికల్‌ డివైజెస్‌ పార్కు ఏర్పాటు చేశాం. లైఫ్‌ సైన్సెస్‌తో పాటు టెక్నాలజీ రంగానికీ హైదరాబాద్‌ అత్యుత్తమ వేదికగా మారింది. ప్రైవేటు రంగంలో ఉపగ్రహాల తయారీ మొట్టమొదటిగా నగరంలోనే జరిగింది. ప్రైవేటుగా రాకెట్‌ లాంచింగ్‌ చేసిన స్కైరూట్‌ సంస్థ ప్రతినిధులకు అభినందనలు తెలియజేస్తున్నా ’’ అని కేటీఆర్‌ అన్నారు. 

విదేశీ కంపెనీలకు గమ్యస్థానంగా దక్షిణాది: భారత్‌ బయోటెక్‌ ఎండీ సుచిత్ర ఎల్ల

తెలంగాణకు పెట్టుబడుల కోసం మంత్రి కేటీఆర్‌ కృషి చేస్తున్నారని భారత్‌ బయోటెక్‌ ఎండీ సుచిత్ర ఎల్ల అన్నారు. రాష్ట్రం సాధిస్తున్న వృద్ధి వల్లే పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. పెట్టుబడిదారులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం బాగుందన్నారు. ‘‘రాష్ట్రంలో టీఎస్‌ ఐపాస్‌ ద్వారా సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ విధానం బాగుంది. ఆవిష్కరణలను ప్రోత్సహించే టీ హబ్‌ మంచి ఆలోచన. పునరుత్పాదక రంగంలో పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. విదేశీ కంపెనీలకు దక్షిణాది రాష్ట్రాలు గమ్యస్థానంగా ఉన్నాయి’’ అని సుచిత్ర ఎల్ల చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని