ఆపత్కాలంలో అద్భుత ఆలోచన!

ఒంట్లో అనారోగ్యంగా ఉంటే వైద్యులు సూచించిన మందులు వాడడం.. వాటి అవసరం తీరాక ఓ మూలన పడేయడం ప్రతి ఇంట్లోనూ జరిగేదే. ప్రస్తుతం కొవిడ్‌ వేళ చాలా మంది విరివిగా మందులు వాడుతున్నారు. కొందరు పాజిటివ్...

Published : 12 May 2021 18:31 IST

​​​​​​వాడగా మిగిలిన మందులను సేకరించిన వైద్య దంపతులు

10 రోజుల్లో 20 కేజీలు సేకరించి అందజేత

ముంబయి: అనారోగ్యంగా ఉంటే వైద్యులు సూచించిన మందులు వాడడం.. వాటి అవసరం తీరాక ఓ మూలన పడేయడం ప్రతి ఇంట్లోనూ జరిగేదే. ప్రస్తుతం కొవిడ్‌ వేళ చాలా మంది విరివిగా మందులు వాడుతున్నారు. కొందరు పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు కూడా తాము వాడిన తర్వాత మిగిలిన పోయిన మందులను అలానే వదిలేస్తున్నారు. అలాంటి మందులను సేకరించి మందులను కొనుక్కోలేని స్థితిలో ఉన్నవారికి అందజేస్తున్నారు ముంబయికి చెందిన ఈ వైద్య దంపతులు. కేవలం 10 రోజుల్లోనే సుమారు 20 కేజీల ఔషధాలను సేకరించి వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు.

ముంబయికి చెందిన డాక్టర్‌ మార్కస్‌ ర్యానీ, ఆయన భార్య డాక్టర్‌ రైనా వాడగా మిగిలి పోయిన మందుల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కొవిడ్‌ వేళ ఔషధాలను కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నవారికి ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ సిబ్బందికి చెందిన కుటుంబ సభ్యులు కొవిడ్‌ బారిన పడ్డారని, వారు మందులను కొనుగోలు చేసే స్థితిలో లేరని గ్రహించడం నుంచి ఈ ఆలోచన పురుడు పోసుకుందని తెలిపారు. దీంతో ఏడెమిది మందితో బృందంగా ఏర్పడి మందులు, కొవిడ్‌ చికిత్సకు వాడే పరికరాలను సేకరించామని చెప్పారు. ఈ నెల 1 నుంచి ఈ కార్యక్రమం చేపట్టామని, కేవలం 10 రోజుల్లోనే 20 కేజీల ఔషధాలను సేకరించామని వివరించారు. సేకరించిన వాటిలో యాంటీ బయోటిక్స్‌, స్టెరాయిడ్స్‌, ఇన్‌హేలర్లు, విటమిన్‌ మాత్రలతో పాటు పల్స్‌ ఆక్సీమీటర్లు, థర్మోమీటర్లు కూడా ఉన్నాయని వైద్య దంపతులు తెలిపారు. ఇలా సేకరించిన వాటిని పేదలకు అందించేందుకు ఓ స్వచ్ఛంద సంస్థకు అందించామని చెప్పారు. ఇదే స్ఫూర్తితో చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు వాలంటీర్లుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారని చెప్పుకొచ్చారు. బాగుంది కదూ ఆలోచన!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని