
Gold: చెత్తలో 10 తులాల బంగారం దొరికినా.. తిరిగిచ్చేసింది!
చెన్నై: ఓ పారిశ్యుద్ధ కార్మికురాలు తన నిజాయితీని చాటుకుంది. పేదరికంలో ఉన్నా.. డబ్బు కంటే నీతికే ఎక్కువ విలువ ఇచ్చే వ్యక్తులూ ఉన్నారని నిరూపించింది. తాజాగా ఓ వ్యక్తి రూ.7.5లక్షల విలువ చేసే 10 తులాల బంగారాన్ని పొగొట్టుకోగా.. పారిశుద్ధ్య కార్మికురాలికి దొరికింది. దాన్ని ఆమె నిజాయితీతో తిరిగి ఇచ్చేసింది. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
సతాంగులమ్ ప్రాంతానికి చెందిన గణేశ్ రామన్ అనే వ్యక్తి ఓ కొరియర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రతి నెల వచ్చే జీతంలో కొంత మొత్తాన్ని కూడబెట్టి ఇటీవల 10 తులాల బంగారు డాలర్ను కొనుగోలు చేశాడు. దాన్ని తీసుకెళ్లి ఇంట్లో వాళ్లకు తెలియకుండా తన బెడ్ కింద దాచిపెట్టాడు. కాగా.. మరుసటి రోజు గణేశ్ భార్య బెడ్రూమ్ను శుభ్రం చేసే క్రమంలో బంగారం ఉన్న ప్యాకెట్ను చూసుకోకుండా చెత్తకుప్పలో పడేసింది. ఈ విషయం తెలుసుకున్న గణేశ్కు గుండె ఆగినంత పనైంది. ఆ చెత్తకుప్ప దగ్గరికెళ్లి చూస్తే అప్పటికే పారిశుద్ధ కార్మికులు చెత్తను తొలగించేశారు. దీంతో గణేశ్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు బంగారం పోయిన రోజు చెత్త తొలగించే విధుల్లో ఉన్న పారిశ్యుద్ధ కార్మికుల వివరాలు తీసుకొని వారిని విచారించారు. ఆ రోజు విధులు నిర్వర్తిస్తున్న మేరి అనే పారిశ్యుద్ధ కార్మికురాలికే గణేశ్ పోగొట్టుకున్న బంగారం దొరికినట్లు గుర్తించారు. మేరీని ప్రశ్నించగా.. ఆమె అప్పటికే తనకు దొరికిన బంగారాన్ని.. దాని యజమానికి అందజేయమని ఉన్నతాధికారులకు అప్పగించిందట. దీంతో సతాంగులమ్ పోలీసులు అధికారుల్ని, మేరీని, గణేశ్ను పోలీస్ స్టేషన్కు పిలిపించి.. పోయిన బంగారాన్ని మేరీ చేతులమీదుగా గణేశ్కు అప్పగించారు. మేరీ నిజాయితీని పోలీసులు, స్థానికులు మెచ్చుకున్నారు.