‘కదలకుండా 2 గంటలు’: పాపులరైన యువకుడు

సోషల్‌ మీడియాలో యూట్యూబ్‌ ఒకటి. ఎంతో మంది ఇందులో పాపులర్‌ కావడం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. నెటిజన్లకు ఆకట్టుకోవడం కోసం తమ సృజనాత్మకత వెలికితీసి, నానా కష్టాలు పడి వీడియోలు చేసి పెడుతుంటారు. కానీ ఇండొనేషియాకి చెందిన ఓ యువకుడు

Updated : 29 Jun 2023 16:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌ మీడియాలో యూట్యూబ్‌ ఒకటి. ఎంతో మంది ఇందులో పాపులర్‌ కావడం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. నెటిజన్లను ఆకట్టుకోవడం కోసం తమ సృజనాత్మకత వెలికితీసి, నానా కష్టాలు పడి వీడియోలు చేసి పెడుతుంటారు. కానీ ఇండొనేషియాకి చెందిన ఓ యువకుడు మాత్రం ఏం చేయకుండా కేవలం కెమెరా ముందు కూర్చొని బాగా పాపులర్‌ అయ్యాడు. ఇప్పుడు అక్కడి సోషల్‌మీడియాలో ఆ యువకుడి వీడియోలు, మీమ్స్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి. అతడిలా వీడియోలు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. 

చాలా మందిలాగే ఇండోనేషియాకు చెందిన మహ్మద్‌ దిదిత్‌ ఓ యూట్యూబర్‌. యువత కోసం ప్రత్యేకమైన వీడియోలు చేస్తుంటాడు. అయితే ఇటీవల ఏం చేయాలో తెలియక 2 గంటల పాటు కంప్యూటర్‌ కెమెరా ముందు ఖాళీగా కూర్చొని వీడియో రికార్డ్‌ చేశాడు. రికార్డింగ్‌ సమయంలో ముఖంలో ఎలాంటి హావభావాలు లేకుండా కనీసం కదలకుండా కూర్చున్నాడు. అలా 2 గంటలు ఏం చేయకుండా తీసిన వీడియోను ‘ 2 అవర్స్‌ ఆఫ్‌ డూయింగ్‌ నథింగ్‌’ పేరుతో యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశాడు. అంతే.. ఆ వీడియో తెగ పాపులర్‌ అయింది. అప్‌లోడ్‌ చేసిన కొన్నిరోజుల్లోనే 20లక్షల వ్యూస్‌ వచ్చాయి. అతడి వీడియోపై పేరడీలు, మీమ్స్‌ వచ్చాయి. దీనిని ఓ ఛాలెంజ్‌లా తీసుకొని మరికొందరు మహ్మద్‌లా 2 గంటలు ఏం చేయకుండా ఖాళీగా కూర్చొని వీడియో రికార్డ్‌ చేస్తున్నారు. అంతే కాదు.. ఆ రెండు గంటల్లో అతడు ఎన్నిసార్లు కనురెప్పలు కొట్టాడో లెక్కపెట్టి కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఈ వీడియోని మహ్మద్‌ కేవలం 5 నుంచి 10 నిమిషాలపాటే చేయాలనుకున్నాడట. కానీ అలా కూర్చొడం బాగుందనిపించి.. రెండు గంటలు కొనసాగించాడు. స్థానిక మీడియా ఈ వీడియో గురించి మహ్మద్‌ను ఇంటర్వ్యూలు చేస్తున్నాయట. అలా మహ్మద్‌ ఉన్నఫలంగా ఫేమస్‌ అయిపోయాడు. తమషాగా చేసినా ఇప్పుడు వచ్చిన ఈ పాపులారిటీకి మహ్మద్‌ సంతోషంలో మునిగితేలుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని