Delhi liquor scam: హైదరాబాద్‌ కేంద్రంగానే లిక్కర్‌ స్కామ్‌.. రిమాండ్‌ రిపోర్టులో ఈడీ

దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ హైదరాబాద్‌ కేంద్రంగానే జరిగిందని ఈడీ పేర్కొంది. దినేష్ అరోరాను హైదరాబాద్‌కు పిలిపించిన సౌత్‌ గ్రూప్‌.. ఐటీసీ కోహినూర్‌లోనే కీలక చర్చలు, ఒప్పందాలు చేసుకుందని సిసోడియా రిమాండ్‌ రిపోర్టులో ఈడీ వెల్లడించింది.

Updated : 10 Mar 2023 20:28 IST

దిల్లీ: మనీశ్‌ సిసోదియాను ఇవాళ కోర్టులో హాజరు పరిచిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ఆయనతో పాటు రిమాండ్‌ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. 58 పేజీల రిమాండ్‌ రిపోర్టులో ఇప్పటి వరకు వెలుగులోకి రాని రాజకీయ, ఆర్థిక, నేరపూరిత వ్యవహారాలను ఈడీ బయటపెట్టింది. లిక్కర్‌ స్కామ్‌ హైదరాబాద్‌ కేంద్రంగానే జరిగిందని ఈడీ పేర్కొంది. దినేష్ అరోరాను హైదరాబాద్‌కు పిలిపించిన సౌత్‌ గ్రూప్‌.. ఐటీసీ కోహినూర్‌లోనే కీలక చర్చలు, ఒప్పందాలు చేసుకుందని వెల్లడించింది. ఎమ్మెల్సీ కవితకు, దిల్లీ సీఎం, డిప్యూటీ సీఎంతో ఈ విషయంలో అవగాహన ఉందని బుచ్చిబాబు చెప్పారని ఈడీ తెలిపింది.

‘‘2021 మార్చి 19, 20 తేదీల్లో విజయ్‌నాయర్‌ని కవిత కలిశారు. మద్యం కేసులో రాజకీయ ఆర్థిక, నేరపూరిత అంశాలు ఉన్నాయి. కేజ్రీవాల్‌, సిసోదియా తరఫున విజయ్‌నాయర్‌ పనిచేశారని బుచ్చిబాబు చెప్పారు. ఇండోస్పిరిట్‌ కంపెనీలో 32 శాతం వాటాను అరుణ్ పిళ్లై పేరుతో కవిత కలిగి ఉన్నారు. కవితకు అనుకూలంగా మద్యం విధానంలో మార్పులు చేస్తే.. కొన్ని నిధులు ఆప్‌కు ఇవ్వడానికి అవగాహన కుదిరింది.  ఇదే విషయాన్ని బుచ్చిబాబు తన వాంగ్మూలంలో తెలిపారు. 2021 జూన్‌లో హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌లో అరుణ్‌ పిళ్లై, అభిషేక్‌ బోయినపల్లి, విజయ్‌ నాయర్‌, దినేశ్‌ అరోరా హాజరయ్యారు. రూ.100కోట్ల ముడుపులు ఎలా ఇవ్వాలి, హవాలా మార్గంలో దిల్లీకి ఎలా తరలించాలనే అంశాలపై భేటీలో చర్చించారు. తొలుత కోటి రూపాయలు దిల్లీలోని బెంగాలీ మార్కెట్‌లో ఉన్న హవాలా ఆపరేటర్‌ ద్వారా తీసుకున్నారు. సౌత్‌ గ్రూప్‌ ద్వారా దినేష్ అరోరానే రూ.31కోట్ల వరకు నగదు తీసుకున్నారు. ఈ నగదును ఆయన ఆప్‌ నేతలకు చేరవేశారు. కొత్త మద్యం విధానం రూపకల్పన జరుగుతున్న సమయంలోనే సిసోదియా 14 మొబైల్‌ ఫోన్లు మార్చారు. సీబీఐ దాడుల్లో వాటిలో రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

మద్యం విధానాన్ని అధికారికంగా విడుదల చేయడానికి రెండు రోజుల ముందే.. బుచ్చిబాబుకి ఆ వివరాలు అందాయి. మద్యం విధానంలో కొన్ని అంశాలను బుచ్చిబాబు మొబైల్‌లో గుర్తించాం. మద్యం పాలసీలో 12 శాతం ప్రాఫిట్‌ ఉండేలా మార్చినట్టు.. దానిలో ఆప్‌ నేతలకు 6 శాతం అందించాలని విజయ్‌ నాయర్‌ చెప్పినట్టు దినేష్‌ అరోరా కూడా ఒక స్టేట్‌మెంట్‌లో చెప్పారు. మద్యం వ్యవహారంపై దిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ విచారణ చేపట్టాలని కోరిన రోజే సిసోదియా ఒక మొబైల్‌ మార్చారు. ఇదే సందర్భంలో వేరొకరి పేర్లతో సిమ్‌ కార్డులు వినియోగించారు. దీనిలో ముడుపుల ద్వారా వచ్చినవి రూ.100కోట్లు, ఇండోస్పిరిట్స్‌ లాభం ద్వారా రూ.192 కోట్లు దక్కించుకున్నారు. ముడుపుల విషయంలో సిసోదియా పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. రూ.292.8 కోట్లు దక్కిన ఈ వ్యవహారంలో సిసోదియా కీలకంగా వ్యవహరించారు’’ అని ఈడీ రిమాండ్‌ రిపోర్టులో పేర్కొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని