Andhra News: మొబైల్‌ చూస్తూ.. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రాసిన అభ్యర్థి

ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్షలో ఓ వ్యక్తి మొబైల్‌ చూస్తూ సమాధానాలు గుర్తిస్తుండగా అధికారులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Published : 09 Jan 2023 01:15 IST

అమరావతి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 92 పోస్టుల భర్తీకోసం ఏపీపీఎస్సీ (APPSC) నిర్వహించిన గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్ష (Group-1 Prelims Exam) ప్రశాంతంగా ముగిసింది. 18 జిల్లాల్లో 297 పరీక్షా కేంద్రాలను ఏపీపీఎస్సీ ఏర్పాటు చేసింది. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహించారు. విజయవాడ బెంజి సర్కిల్‌లోని నారాయణ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో కాపీయింగ్‌ వెలుగు చూసింది. ఉదయం నిర్వహించిన ప్రిలిమ్స్‌ పరీక్షకు పోరంకి సచివాలయంలో పనిచేస్తున్న కొల్లూరు వెంకటేశ్‌ అనే అభ్యర్థి ఏకంగా మొబైల్‌ తీసుకొచ్చాడు. మొబైల్‌లో గూగుల్‌ ఓపెన్‌ చేసి జవాబులు చూసి రాస్తుండగా అధికారులు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈసారి పేపర్‌-1 పరీక్ష తీరుపై అభ్యర్థుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. పలు ప్రశ్నలు ఎక్కువ నిడివితో ఇచ్చారని, చదవి అర్థం చేసుకునేందుకే ఎక్కువ సమయం పట్టిందని అభ్యర్థులు తెలిపారు. ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు తక్కువ సమయం మిగిలిందని తెలిపారు. కొందరు అభ్యర్థులు మాత్రం.. ఉద్యోగార్థుల సత్తా పరీక్షించేందుకే ఎక్కువ నిడివిగల ప్రశ్నలు ఇచ్చారని తెలిపారు. గ్రూప్‌-1 ఉద్యోగాలకు మొత్తం 1,26,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని