
Coal India: భూగర్భ గనుల్లో తొలి మహిళా మైనింగ్ ఇంజినీర్.. ఆకాంక్షకుమారి!
ఇంటర్నెట్ డెస్క్: భూమి లోపలికి వెళ్లి తవ్వకాలు చేపట్టాలంటే కార్మికులకు ఎంత కష్టంగా ఉంటుందో మనందరికీ తెలుసు. తట్టుకోలేనంత వేడి, ఒక్కోసారి ఊపిరి కూడా అందని పరిస్థితి ఎదురవుతుంటుంది. అటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో పురుషులే పనిచేయడానికే ఎంతో ఇబ్బందిపడుతుంటారు. అలాంటి చోట ఓ మహిళ పనిచేయడానికి సిద్ధపడింది. పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. భూగర్భ గనుల్లో ఆకాంక్షకుమారి అనే మహిళ తొలిసారి మైనింగ్ ఇంజినీర్గా చేరి చరిత్ర సృష్టించింది. ఈ విషయాన్ని సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ ట్విటర్ ద్వారా వెల్లడించింది.
‘ఝార్ఖండ్కు చెందిన ఆకాంక్షకుమారి భూగర్భ గనుల్లో మైనింగ్ ఇంజినీర్గా చేరింది. ఎందరో పురుషులు పనిచేస్తున్న చోట వారికి సరిసమానంగా బాధ్యతలు నిర్వహించడం కోల్ ఇండియా చరిత్రలోనే అరుదైన రికార్డు’ అని సీసీఎల్ తన ట్విటర్ ఖాతాలో పేర్కొంది.
భూగర్భ గనుల్లో మహిళలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని సీసీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆఫీసర్ నుంచి డాక్టర్ వరకు.. సెక్యూరిటీ గార్డు నుంచి భారీ యంత్రాలను నడిపే డ్రైవర్ల వరకు మహిళలు తమ సత్తా చాటుతున్నారని పేర్కొంది. కాగా, ఈ విషయమై కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆమెను అభినందిస్తూ ట్వీట్ చేశారు.