Odisha Train Accident: 12 మంది ఏపీ ప్రయాణికులకు స్వల్ప గాయాలు: మంత్రి అమర్‌నాథ్‌

ఒడిశా రైలు ప్రమాదంలో గాయాలపాలైన వారిని మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్‌లోని ఆస్పత్రులకు పంపామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు.

Updated : 05 Jun 2023 13:12 IST

అమరావతి: ఒడిశా రైలు ప్రమాదంలో గాయాలపాలైన వారిని మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్‌లోని ఆస్పత్రులకు పంపామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. ఏపీ ప్రయాణికుల వివరాలను సేకరించామని చెప్పారు. కోరమాండల్‌లో 309 మంది, యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో 33 మంది కలిపి మొత్తం 342 మంది ఏపీ ప్రయాణికులు ఆయా రైళ్లలో ప్రయాణించినట్లు తెలిపారు. ఒడిశా నుంచి వచ్చిన అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. 

‘‘ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన 12 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం విశాఖలో 8 మందికి చికిత్స అందించాం. ఏపీ నుంచి శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళికి చెందిన గురుమూర్తి అనే వ్యక్తి మాత్రమే మృతిచెందారు. ఆయన జనరల్‌ బోగీలో ప్రయాణించారు. ఈ ప్రమాదంలో వివిధ రాష్ట్రాలకు చెందిన మొత్తం 276 మంది మృతిచెందారు. వారిలో ఇప్పటి వరకు 89 మందిని మాత్రమే గుర్తించారు. ఇంకా 187 మృతదేహాలు అక్కడి మార్చురీల్లో ఉన్నాయి. వాటిని గుర్తించాల్సి ఉంది. 

ఏపీకి చెందిన ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు ఇంకా భువనేశ్వర్‌లోనే ఉంటూ అవసరమైన సహాయం అందిస్తారు. ప్రస్తుతం మన రాష్ట్రంలోని కంట్రోల్‌ రూమ్‌లకు కాల్స్‌ ఏమీ రావడం లేదు. ఖమ్మం జిల్లాకు చెందిన అంబటి రాములు అనే వ్యక్తి  విజయవాడ నుంచి కోల్‌కతాకు వెళ్లారని మన కంట్రోల్‌రూమ్‌కు ఫిర్యాదు వచ్చింది. దానిపై విచారణ చేస్తున్నాం. బాధితులు ఎవరైనా కంట్రోల్‌ రూమ్‌, వాట్సప్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఘటన అనంతరం ఏపీ ప్రభుత్వం సహాయక చర్యల్లో సమర్థంగా వ్యవహరించింది. ఈ విషయంపై రాజకీయాలు, విమర్శలు చేయడం సరికాదు’’ అని మంత్రి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని