Andhra News: యాప్‌ వివాదం.. ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స చర్చలు విఫలం

ముఖ ఆధారిత హాజరు యాప్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాల నేతలతో విద్యాశాఖ మంత్రి

Updated : 18 Aug 2022 17:46 IST

అమరావతి: ముఖ ఆధారిత హాజరు యాప్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాల నేతలతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. గత 3రోజులుగా యాప్‌ డౌన్‌లోడ్‌ను వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయులు వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నారు. విద్యాశాఖ కమిషనర్‌ వద్ద చర్చలు విఫలమవటంతో ఉపాధ్యాయ సంఘాలను మంత్రి చర్చలకు ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నేతలు మాట్లాడుతూ... సొంత ఫోన్లలో ముఖ ఆధారిత హాజరు యాప్‌ను ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. తమ స్మార్ట్‌ ఫోన్లలో యాప్‌డౌన్‌లోడ్‌ చేస్తే వ్యక్తిగత సమాచారం బయటకు లీక్‌ అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలోనే మౌఖిక హాజరు పరికరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. పాఠశాలలో ప్రత్యేక పరికరంతో మౌఖిక హాజరుకు అంగీకరిస్తామని ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. ప్రభుత్వమే మొబైల్‌ డేటాతో కూడిన ఫోన్లు ఇస్తే తమకు అభ్యంతరం లేదన్నారు.

ఉపాధ్యాయుల డిమాండ్లపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... ముఖ ఆధారిత యాప్‌పై కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఉందన్నారు. మంచి లక్ష్యానికి ఉపాధ్యాయులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే లక్షమంది ఉపాధ్యాయులు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని రిజిస్టర్‌ చేసుకున్నారని తెలిపారు. మిగతా 50శాతం మంది త్వరలోనే రిజిస్టర్‌ చేసుకుంటారని వెల్లడించారు. 15 రోజులు శిక్షణా తరగతులు నిర్వహించి యాప్‌ అమల్లోకి తెస్తామని పేర్కొన్నారు. హాజరు, ఆలస్యం విషయంలో పాత నిబంధనలే ఉంటాయని స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సెల్‌ఫోన్లు ఉద్యోగులవా? ప్రభుత్వం ఇస్తుందా? అనేది ఆయా శాఖల నిర్ణయమన్న మంత్రి బొత్స .. మిగతా విభాగాల్లోనూ ఇదే విధానం అమలు కావొచ్చన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని