Kishan Reddy: స్వప్నలోక్‌ అగ్నిప్రమాదం.. చాలా దురదృష్టకరం: కిషన్‌రెడ్డి

ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును స్థానికులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Updated : 19 Mar 2023 12:35 IST

హైదరాబాద్‌: రద్దీగా ఉండే స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటన చాలా దురదృష్టకరమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. భవనాల యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని తెలిపారు. ఆదివారం స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ను పరిశీలించిన ఆయన.. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ప్రమాద ఘటనలో పేదలు, అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. ప్రమాదాలు సంభవిస్తున్నప్పటికీ ప్రమాదాలకు కారకులైన వారిపై జీహెచ్‌ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదు. ప్రమాదం జరిగినప్పుడు చర్యలు తీసుకుంటామంటున్నారు.. ఆ తర్వాత మర్చిపోతున్నారు. ప్రమాదాల నివారణకు అవసరమైన సామగ్రి కూడా అందుబాటులో ఉండట్లేదు. గోదాములు, స్ర్కాప్‌ దుకాణాలను అధికారులు తనిఖీ చేయట్లేదు. ప్రమాదకరంగా ఉన్న గోదాములను నగర శివారు ప్రాంతాలకు తరలించాలి. రాష్ట్రంలో సిబ్బంది కొరత ఉందని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ శాఖకు కొత్తగా వచ్చిన పరికరాలను సమకూర్చాలి’’ అని కిషన్‌రెడ్డి సూచించారు.

ప్రభుత్వం ఆదాయం కోసం అక్రమ భవనాలను క్రమబద్ధీకరిస్తోందని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. ఎక్కువ ఆదాయం వస్తోందని అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఇస్తామనే సంస్థల గురించి నిరుద్యోగ యువత తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాంటి సంస్థలపై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని