KTR: దుష్ప్రచారంతో అభివృద్ధిని అడ్డుకోవద్దని ప్రగతి నిరోధకులను కోరుతున్నా: కేటీఆర్‌

ఎంతో కష్టపడి ఇతర రాష్ట్రాలు, దేశాలతో పోటీపడి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తే.. ఇది జీర్ణించుకోలేని కొంత మంది ప్రగతి నిరోధకులు కూడా ఉంటారని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Updated : 06 May 2023 15:27 IST

దివిటిపల్లి: ఏ దేశమైనా, రాష్ట్రమైనా అందరికీ ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో పరిశ్రమల ఏర్పాటుకు ఊతమిస్తేనే అందరికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌.. మరో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పర్యటనలో భాగంగా మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఐటీ టవర్‌ను కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం ఐటీ కారిడార్‌లో ఏర్పాటు చేయనున్న అమరరాజా సంస్థకు చెందిన గిగా కారిడార్‌కు కేటీఆర్ భూమి పూజ చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘ఇది పోటీ ప్రపంచం. ఎన్నో ప్రయత్నాలు చేస్తే తప్ప పరిశ్రమలు తీసుకురాలేం. అభివృద్ధి విషయంలో రాష్ట్రాలు మాత్రమే పోటీ పడటం లేదు. ఎన్నో దేశాలతో పోటీ పడి పారిశ్రామికవేత్తలను మెప్పించి రాష్ట్రానికి రప్పించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ప్రైవేటు రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. భారత దేశంలో అపారమైన యువ శక్తి ఉంది. దేశ జనాభాలో 35 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న వారు 65 శాతం ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వ రంగంలో ఉపాధి కల్పించడం సాధ్యం కాదు. మరి ప్రభుత్వాలు ఏం చేయాలి? అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వాలు కృషి చేయాలి. అప్పుడే కొలువులు వస్తాయి. రాష్ట్రానికి సంపద వస్తుంది.

తెలంగాణలో ఆహార ఉత్పత్తుల పరిశ్రమను ఏర్పాటు చేయాలని ఆరేళ్ల క్రితం గల్లా జయదేవ్‌ను కోరాను. రాష్ట్రంలో ఏదైనా భారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ఆనాడే ఆయన అన్నారు. ఇవాళ మహబూబ్‌నగర్‌లో అమరరాజా యూనిట్‌ రావడం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి ఉపాది లభించే అవకాశం ఉంది. దీని వల్ల పరిసర ప్రాంతాల రూపు రేఖలు మారిపోతాయి. ఇది చూసి మరిన్ని పరిశ్రమలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తాయి. వచ్చే పదేళ్లలో అమరరాజా సంస్థ రూ.9,500 కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది. ఫ్యాక్టరీ నిర్మాణం సాగుతుండగానే స్థానికంగా ఉన్న ఐటీ టవర్‌లో సంస్థకు సంబంధించి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలు మొదలుపెట్టి.. స్థానికులకు అర్హతకు తగిన ఉద్యోగం కూడా ఇస్తామని సంస్థ వెల్లడించింది. స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు సంస్థకు అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించాలి.

ఎంతో కష్టపడి ఇతర రాష్ట్రాలు, దేశాలతో పోటీపడి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తే.. ఇది జీర్ణించుకోలేని కొంత మంది ప్రగతి నిరోధకులు కూడా ఉంటారు. కొంత మంది చెడు ప్రచారం సృష్టించి జరిగే మంచి పనికి విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది బ్యాటరీ సంస్థ కాబట్టి ఇక్కడ కాలుష్య సంబంధిత సమస్యలు వస్తాయని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ పెట్టబోతున్నది లిథియం అయాన్‌ బ్యాటరీ తయారీ యూనిట్‌. ఎలక్ట్రిక్‌ వాహనాల్లో వాడే బ్యాటరీలే ఇక్కడ తయారు చేస్తారు. జీరో లిక్కిడ్‌ డిశ్చార్జ్‌ సాంకేతికతతో అంతర్జాతీయ ప్రమాణాలతో యూనిట్‌ ఏర్పాటు చేయబోతున్నారు. అభివృద్ధిని అడ్డుకోవద్దని ప్రగతి నిరోధకులను కోరుతున్నా’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని