Supreme Court: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. అత్యవసర విచారణకు సీజేఐకి విజ్ఞప్తి

ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో సీజేఐ ధర్మాసనం ఎదుట తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన అభ్యర్థనపై సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ స్పందించారు.

Published : 07 Feb 2023 19:10 IST

దిల్లీ: ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో సీజేఐ ధర్మాసనం ఎదుట రాష్ట్రప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ కేసును అత్యవసరంగా విచారణకు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీబీఐతో విచారణ విషయంలో తమ అభ్యంతరాలను డివిజన్‌ బెంచ్‌ పరిగణనలోకి తీసుకోలేదని ఆయన కోర్టుకు తెలిపారు. దర్యాప్తు సీబీఐ చేతుల్లోకి వెళితే.. ఇప్పటివరకు జరిగిన విచారణ అంతా దెబ్బతింటుందని పేర్కొన్నారు. బుధవారం ఉదయం కోర్టు కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత మరోసారి మెన్షన్‌ చేయాలని, విచారణ తేదీ ఇస్తామని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ తెలిపారు. ఒక వేళ మెన్షన్‌ చేయకపోయినా..  వచ్చే వారం కేసు విచారణకు వస్తుందన్నారు.

ఏం జరిగిందంటే?

ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకు అప్పగిస్తూ ఇచ్చిన తీర్పును రెండు వారాలు నిలిపివేయాలని హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పగించడంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసేందుకు సిద్ధమవుతోందని.. అందుకోసం సుప్రీంకు వెళ్లేందుకు వీలుగా తీర్పును ఆపాలని సింగిల్‌ జడ్జిని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ కోరారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి బెంచ్‌ అత్యవసర విచారణకు స్వీకరించింది. ఈ కేసుపై విచారణ చేపట్టేందుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. సింగిల్‌ జడ్జి సూచన మేరకు రేపు (బుధవారం) సీజే అనుమతి కోరతామని అడ్వొకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు.

ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంలో మొయినాబాద్‌ ఫాం హౌస్‌ కేసు సీబీఐకి అప్పగించాలని కోరుతూ నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్‌, సింహయాజీలతో పాటు న్యాయవాది భూసారపు శ్రీనివాస్‌, కేరళకు చెందిన తుషార్‌ వెల్లపల్లిలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్‌లపై విచారించిన సింగిల్‌ జడ్జి... కేసు దర్యాప్తును సిట్‌ నుంచి సీబీఐకి అప్పగిస్తూ డిసెంబరు 26న తీర్పు వెలువరించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి దాఖలు చేసిన అప్పీళ్లు విచారణార్హం కావని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం సోమవారం కొట్టివేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని