
Published : 18 Jan 2022 17:43 IST
TSRTC: సంక్రాంతి వేళ.. టీఎస్ఆర్టీసీకి కాసుల పంట
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)కి సంక్రాంతి పండుగ కాసుల వర్షం కురిపించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈనెల 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు టీఎస్ఆర్టీసీ సాధారణ షెడ్యూల్ బస్సులకు అదనంగా సుమారు 4 వేల బస్సులను నడిపించింది. ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా సుమారు 55 లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. తద్వారా ఆర్టీసీకీ రూ.107 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. కరోనాకు ముందు ప్రతి రోజు ఆర్టీసీకీ రూ.12 కోట్ల పైచిలుకు ఆదాయం వచ్చేదని.. సంక్రాంతి సమయంలో రోజుకు సుమారు రూ.15.20 కోట్లకుపైగా ఆదాయం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆర్టీసీని ఆదరించిన ప్రయాణికులకు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ కృతజ్ఞతలు తెలియజేశారు.
Tags :