Top Ten News @ 9 AM

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీకోసం..

Updated : 20 May 2021 12:43 IST

1. AP BUDGET: ₹2.30 లక్షల కోట్లతో! నేడే బడ్జెట్‌

ఏపీ రాష్ట్ర బడ్జెట్‌ను నేడు శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. కొవిడ్‌ రెండో దశ ఉద్ధృతి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు గురువారం ఒక్కరోజుకే పరిమితం కానున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయి.  ఉదయం 11 గంటల తర్వాత ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్‌రెడ్డి రూ.2.30 లక్షల కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెడతారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

* రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 1.5% వృద్ధి

2. TS GOVT:  బ్లాక్ ఫంగ‌స్‌పై కీల‌క నిర్ణ‌యం

క‌రోనా బారిన ప‌డి కోలుకుంటున్న వారిలో కొంద‌రిని వేధిస్తున్న బ్లాక్ ఫంగ‌స్‌పై ఇప్ప‌టికే అప్ర‌మ‌త్త‌మైన తెలంగాణ ప్ర‌భుత్వం తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. బ్లాక్‌ఫంగ‌స్‌ను నోటిఫియాబుల్ వ్యాధిగా ప్ర‌క‌టించింది. రాష్ట్రంలో దీనికి సంబంధించి కేసులు ఎక్క‌డ న‌మోదైనా త‌ప్ప‌కుండా ప్ర‌భుత్వానికి స‌మాచారం అందించాల‌ని ఆదేశించింది. తెలంగాణ‌లోని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు ఆస్పత్రుల‌న్నింటికీ ఈ నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయ‌ని స్ప‌ష్టం చేసింది. ప్ర‌తి రోజూ ఆయా ఆస్ప‌త్రుల్లో న‌మోదైన బ్లాక్ ఫంగ‌స్ అనుమానిత ల‌క్ష‌ణాలు ఉన్న వారి వివ‌రాలు ఆరోగ్య శాఖకు అందించాల్సి ఉంటుంద‌ని ప్ర‌భుత్వం వివ‌రించింది. 

* ‘పది’ ఫలితాల వెల్లడికి మంత్రి పచ్చజెండా

3. 18 ఏళ్ల లోపు పిల్లలకే రూ.10 లక్షల డిపాజిట్‌

కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులు చనిపోయి అనాథలైన పిల్లల సంరక్షణ కోసం రూ.10 లక్షలను ఏపీ ప్రభుత్వం జాతీయ బ్యాంక్‌లో డిపాజిట్‌ చేసే నిమిత్తం వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. 18 ఏళ్లలోపు వయసున్న వారు ఇందుకు అర్హులుగా పేర్కొంది. తల్లిదండ్రుల్లో ఒకరు అంతకుముందే చనిపోయినప్పటికీ ఈ పథకం వర్తిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. DAP ఎరువుపై భారీ రాయితీ

రసాయన ఎరువుల ధరల భారం నుంచి రైతులకు భారీ ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. డీఏపీ ఎరువుపై ప్రస్తుతం బస్తాకు ఇస్తున్న రూ.500 రాయితీని రూ.1,200కి పెంచింది. తద్వారా ఈ ఎరువుపై రైతుకు అదనంగా 140%మేర రాయితీ ప్రయోజనం లభించనుంది. బుధవారం ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) ఒక ప్రకటనలో తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. Vaccine: కోలుకున్న 3 నెలల తర్వాతే టీకా

కరోనాతో బాధపడుతున్న వారు, కోలుకున్న బాధితులు, మొదటి డోసు టీకా తీసుకున్న తర్వాత వైరస్‌ బారిన పడిన వారు, ప్లాస్మా చికిత్స పొందిన వారు టీకా తీసుకోవాల్సిన సమయంపై కేంద్ర ప్రభుత్వ  నిపుణుల బృందం (నేషనల్‌ ఎక్స్‌పర్ట్‌ గ్రూప్‌ ఆన్‌ వ్యాక్సిన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఫర్‌ కొవిడ్‌- నెగ్‌వ్యాక్‌) స్పష్టతనిచ్చింది. వీరు ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయిన మూడు నెలల తర్వాతే టీకా తీసుకోవాలని సూచిస్తూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు సిఫార్సు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

6. కరోనాది గెరిల్లా యుద్ధం

‘దేశంలో కరోనా రెండో దశ గురించి నిపుణులు ముందే హెచ్చరించినా బేఖాతరు చేశాం. కరోనా చేస్తోంది గెరిల్లా యుద్ధం లాంటిది. అది ఒక్కసారి దాడి చేశాక.. మన స్పందన దీటుగా ఉండాలి. వైరస్‌ కొంతకాలం స్తబ్దుగా ఉండిపోయి, అదును చూసి మళ్లీ విజృంభించే అవకాశమూ ఉంది. పైగా కరోనా.. ఆర్‌ఎన్‌ఏ వైరస్‌. త్వరితగతిన రూపు మార్చుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఇదే జరుగుతున్నా మన ప్రభుత్వాలు, వ్యవస్థలూ గమనించలేదు’ అని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, తన సుదీర్ఘ సర్వీసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్‌ పీవీ రమేష్‌ ‘ఈనాడు’ ప్రత్యేక ముఖాముఖిలో చేసిన విశ్లేషణ ఇది. పూర్తి ఇంటర్వ్యూ కోసం క్లిక్‌ చేయండి 

7. పతనం దిశగా ఆర్థిక వ్యవస్థ!

ఏప్రిల్‌ నెలలో స్థూల ఆర్థిక గణాంకాలు రాణిస్తున్నాయన్నది నిజమే కానీ.. అది గతేడాది ఉన్న తక్కువ ప్రాతిపాదిక(లో బేస్‌ ఎఫెక్ట్‌) కారణంగా అని గుర్తుంచుకోవాలని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంటోంది. అదే సమయంలో కరోనా మలి విడత కారణంగా వినియోగదారు సెంటిమెంటు దెబ్బతిందని దీని వల్ల ఆర్థిక వ్యవస్థ పతనం దిశగా పయనించే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. మౌనమెందుకు.. మేలుకో!

మాట వినడం లేదంటారు ఒకరు, ఉద్యోగం పోయిందని ఒకరు, మద్యం దొరకట్లేదని మరొకరు ఒత్తిడిని అదుపులో ఉంచుకోలేక అదుపు తప్పుతున్నారు. మాటల్ని తూటాల్లా ఒకరు విసిరితే.. చేతినే ఆయుధంగా చేసుకుని దాడులు చేస్తున్నారు ఇంకొకరు. చిన్న విషయాలే...తుఫానులా మారుతున్నాయి. వెరసి మహిళలపై హింసకు కారణమవుతున్నాయి. నిజానికి గృహహింస మనదేశానికే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య పెరిగింది. ‘కౌన్సిల్‌ ఆఫ్‌ క్రిమినల్‌ జస్టిస్‌’ జరిపిన అధ్యయనంలో తేలిందేంటంటే... ప్రపంచవ్యాప్తంగా సగటున 8.1శాతం గృహహింస పెరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ఆసియాకప్‌ రద్దు

శ్రీలంకలో జూన్‌లో జరగాల్సిన 2021 ఆసియాకప్‌ రద్దయింది. ఆ దేశంలో కొవిడ్‌ కేసులు పెరుగుతుండడమే అందుకు కారణం. నిజానికి ఆసియాకప్‌ పాకిస్థాన్‌లో జరగాల్సింది. కానీ భారత జట్టు అక్కడికి వెళ్లే అవకాశం లేనందున టోర్నీని శ్రీలంకకు మార్చారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో లంక ప్రభుత్వం ఇప్పటికే 10 రోజుల పాటు అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం విధించింది.

* ఒలింపిక్స్‌ను రద్దు చేయండి

10. అటు విమానాలు.. ఇటు రాకెట్లు

ఒకవైపు కాల్పుల విరమణకు అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తున్నా.. ఇజ్రాయెల్‌, హమాస్‌ మాత్రం పరస్పర దాడులు ఆపడంలేదు. ఇజ్రాయెల్‌ విమానాలు బుధవారం కూడా గాజాపై విరుచుకుపడ్డాయి. 25 నిమిషాల వ్యవధిలో 52 విమానాలు 40 లక్ష్యాలపై దాడి చేసి పలు భవనాలను ధ్వంసం చేశాయి. ఆరుగురు మరణించినట్లు గాజా ఆరోగ్యశాఖ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని