బెయిల్‌ కోసం సుప్రీం కోర్టుకు ఎంపీ రఘురామ

బెయిల్‌ కోసం ఎంపీ రఘు రామకృష్ణ రాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏపీ సీఐడీ తనపై నమోదు చేసిన కేసులో...

Published : 16 May 2021 00:27 IST

అమరావతి: నర్సాపురం ఎంపీ రఘు రామకృష్ణరాజు బెయిల్‌ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏపీ సీఐడీ తనపై నమోదు చేసిన కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. రఘురామ బెయిల్‌ పిటిషన్‌ ఆదివారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఎంపీ రఘురామకృష్ణరాజుకు గుంటూరులోని సీఐడీ న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఈ నెల 28 వరకు ఆయనకు రిమాండ్‌ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. ఆయన కాళ్లపై గాయాలు ఉండటంతో ఎంపీని ఆస్పత్రికి తరలించాలని సీఐడీ కోర్టు ఆదేశించింది. ముందుగా జీజీహెచ్‌.. ఆ తర్వాత రమేశ్‌ ఆస్పత్రికి తరలించాలని సూచించింది. ఆయన కోలుకొనే వరకు ఆస్పత్రిలో ఉండొచ్చని తెలిపింది. ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతున్నంత వరకు ఆయనకు వై కేటగిరీ భద్రత కొనసాగుతుందని తెలిపింది.

జీజీహెచ్‌కు చేరుకున్న రఘురామ

మరోవైపు, కొద్దిసేపటి క్రితమే రఘురామను గుంటూరులోని జీజీహెచ్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. సీఐడీ కోర్టు ఆదేశాలకనుగుణంగా వైద్య పరీక్షల కోసం ఆయన్ను ఇక్కడికి అధికారులు తీసుకొచ్చారు. వైద్యులు రఘురామకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. 18 రకాల వైద్య పరీక్షలు చేయాలని డాక్టర్లు నిర్ణయించారు. రాత్రంతా రఘురామకృష్ణ రాజుకు వైద్య పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్షలు పూర్తి అయిన తర్వాత  తెల్లవారుజామును ఆయనను రమేశ్‌ ఆస్పత్రికి తీసుకెళ్లే అవకాశం ఉంది. వైద్యుల కమిటీ ఆయన శరీరంపై గాయాలను క్షుణ్నంగా పరిశీలించి నివేదిక ఇవ్వనుంది. మరోవైపు జీజీహెచ్‌ ఆసుపత్రికి సీఐడీ డీఐజీ సునీల్‌ కుమార్‌ నాయక్‌ చేరుకున్నారు. రఘురామ కృష్ణరాజుకు జరుగుతున్న వైద్య పరీక్షలను ఆయన పరిశీలించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని