వైద్యం అందకే అమ్మను, భర్తను కోల్పోయా

దూరదర్శన్‌ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ అర్చన దత్తా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. గంటల వ్యవధిలో ఆమె తన తల్లిని, భర్తను కోల్పోయారు. వైద్యం అందకే అమ్మను, భర్తను కోల్పోయానని అర్చన దత్తా ట్విటర్‌లో ఆవేదన వెల్లగక్కారు....

Updated : 04 May 2021 15:18 IST

ఆవేదన వెల్లగక్కిన దూరదర్శన్‌ మాజీ డైరెక్టర్‌ జనరల్‌

దిల్లీ: కరోనా మహమ్మారి అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. సకాలంలో వైద్యం అందక కుటుంబసభ్యులు మృత్యువాతపడుతున్నారు. దేశ రాజధాని దిల్లీలో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. ప్రముఖులకు సైతం సకాలంలో వైద్యం అందని పరిస్థితి నెలకొంది. దూరదర్శన్‌ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ అర్చన దత్తా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. గంటల వ్యవధిలో ఆమె తన తల్లిని, భర్తను కోల్పోయారు. వైద్యం అందకే అమ్మను, భర్తను కోల్పోయానని అర్చన దత్తా ట్విటర్‌లో ఆవేదన వెల్లగక్కారు. ‘నా కుటుంబానికి ఏమౌతుందిలే అని నాలాగే చాలా మంది బ్రమపడుతుంటారు. కానీ అనుకోనిదే జరిగింది. వైద్యం అందక నా తల్లి, భర్త మృతిచెందారు. దిల్లీలోని ప్రముఖ ఆసుపత్రులను సంప్రదించినా చేర్చుకోలేదు. వారు మృతిచెందాక పాజిటివ్‌గా తేలింది’ అని పేర్కొన్నారు.

అర్చన దత్తా భర్త ఏఆర్‌ దత్తా (68) రక్షణ మంత్రిత్వ శాఖలో ఉదోగం చేసి పదవీ విరమణ పొందారు. అర్చన తల్లి బనీ ముఖర్జీ (88). వీరిద్దరి ఆరోగ్యం ఏప్రిల్‌ 27న క్షీణించింది. అర్చన కుమారుడు అభిషేక్‌ వారిరువురిని దక్షిణ దిల్లీలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తలించాడు. అయితే అక్కడ వారు చేర్చుకోలేదు. ఇలా పలు ఆసుపత్రులకు తరలించినా ఎవ్వరూ స్పందించలేదు. చివరగా ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చినప్పటికీ సమయం మించిపోవడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ గంటల వ్యవధిలో వారిద్దరు మృత్యువాతపడ్డారు. కాగా ఈ విషయాన్ని అర్చన దత్తా మంగళవారం ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం అభిషేక్‌ మినహా తమ కుటుంబసభ్యులందరికీ పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు పేర్కొన్నారు. తన మేనకోడలి ఆరోగ్యం క్షీణిస్తోందని.. ఆక్సిజన్‌ కోసం అభిషేక్‌ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటన ప్రస్తుతం దిల్లీలోని పరిస్థితులకు అద్దం పడుతోంది. ప్రముఖులకే సకాలంలో వైద్యం అందడంలేదంటే మధ్యతరగతి, పేదల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అత్యంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఇళ్లల్లోనే ఉండాలని సూచిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని