మియన్మార్‌: తెలియకుండానే.. భలే తీసిందే!

మయన్మార్‌లో ఇటీవల సైనిక తిరుగుబాటు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆ దేశ పౌరహక్కుల నేత ఆంగ్‌సాన్‌ సూకీ, ఆ దేశ అధ్యక్షుడితో సహా పలువురు

Updated : 05 Feb 2021 14:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మయన్మార్‌లో ఇటీవల సైనిక తిరుగుబాటు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆ దేశ పౌరహక్కుల నేత ఆంగ్‌సాన్‌ సూకీ, ఆ దేశ అధ్యక్షుడితో సహా పలువురు నేతలను సైన్యం నిర్బంధించింది. అంతేకాకుండా దేశ పగ్గాలు కనీసం ఓ ఏడాదిపాటు తమ ఆధీనంలోనే ఉంటాయని ప్రకటించింది. దీనిపై భారత్‌తో సహా పలు దేశాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. ఈ చారిత్రాత్మక ఘటనకు ప్రత్యక్ష సాక్షి అనదగ్గ వీడియోను ఆ దేశానికి చెందిన ఓ మహిళ అనుకోకుండానే రికార్డు చేసింది. ఇదెలా జరిగిందంటే..

యాంగోన్‌ను మయన్మార్‌ ఆర్థిక రాజథాని అనవచ్చు.. ఇదే ఆ దేశంలోకెల్లా అతి పెద్ద నగరం కూడా. ఇక్కడ ఖింగ్‌ నిన్‌ వాయి వ్యాయామ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తారు. ఈమె అలవాటు ప్రకారం అక్కడి సిటీ హాల్‌ సమీపంలో పేవ్‌మెంట్‌పై మ్యూజిక్‌కు అనుగుణంగా ఏరోబిక్స్‌ చేస్తోంది. ఇంతలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు సైనికులు వెళ్లున్న మిలిటరీ వాహనాల కాన్వాయ్‌.. ఆమె వెనక ఉన్న రహదారి మీదుగానే తరలిపోయింది. తన వెనుకనే అన్ని వాహనాలు వెళ్లున్నా, వాయి తన పని తాను చేసుకుంటూ పోవటం గమనార్హం. ఆమె వ్యాయామంతో పాటు.. ఆ వెనుక జరిగిన దృశ్యం కూడా సదరు వీడియోలో రికార్డైంది. దీనిని ఆ మహిళ ఫేస్‌బుక్‌లో షేర్‌ చేస్తే..ఒక్క రోజు కూడా కాకుండానే 55 వేల లైకులు సొంతం చేసుకుంది. ఇక ఇప్పటికే  17 వేల సార్లు షేర్‌ అయిన ఈ వీడియోను కొన్ని లక్షల మంది చూడటంతో వైరల్‌ అయింది.
ఐతే, మూడు నిముషాల పాటు సాగే ఈ వీడియో నిజమైననదేనా అనే సందేహాన్ని కొందరు నెటిజన్లు వ్యక్తం చేశారు. ఇందుకు జవాబుగా.. తాను అదే ప్రదేశంలో ఇదివరకు కూడా ఎన్నో వీడియోలు తీశానని.. వాయి రుజువులతో సహా చూపించింది. సో, అనుకోకుండా రికార్డైన ఈ అరుదైన ఘటనను మీరూ చూసేయండి!

ఇదీ చదవండి..

ఇగ్లూ కేఫ్‌!

అమెరికా భారీకాయుడు.. భారత బాహుబలి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని