Oxygen సిలెండర్ లేదని నెబ్యులైజర్ వాడుతున్నారా?
కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోవడంతో దేశంలో ఆక్సిజన్కు తీవ్ర కొరత ఏర్పడుతోంది. ఆక్సిజన్ ఉత్పత్తి పాంట్ల సామర్థ్యం పెంచడంతోపాటు తాత్కాలిక ప్లాంట్లను నెలకొల్పేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. అంతేకాకుండా విదేశాల నుంచి యుద్ధవిమానాల ద్వారా ఆక్సిజన్ను తెప్పించుకుంటోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో....
చాలా ప్రమాదమని హెచ్చరిస్తున్న వైద్యనిపుణులు
దిల్లీ: కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోవడంతో దేశంలో ఆక్సిజన్కు తీవ్ర కొరత ఏర్పడుతోంది. ఆక్సిజన్ ఉత్పత్తి పాంట్ల సామర్థ్యం పెంచడంతోపాటు తాత్కాలిక ప్లాంట్లను నెలకొల్పేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. అంతేకాకుండా విదేశాల నుంచి యుద్ధవిమానాల ద్వారా ఆక్సిజన్ను తెప్పించుకుంటోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ సిలెండర్ లేనప్పుడు నెబ్యులైజర్ను ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవచ్చనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఆక్సిజన్ సిలిండర్ లేనప్పుడు దీనిని ఎలా ఉపయోగించుకోవాలో చెబుతూ డా. అలోక్ సేథి అనే మెడికల్ ప్రాక్టీషనర్ ట్విటర్లో పోస్టు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుందని చాలా మంది భావించి విపరీతంగా షేర్ చేసేశారు.. అయితే నెబ్యులైజర్ వాడటం మంచి పద్ధతి కాదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ప్రత్యేక ద్రవం నుంచి ఆల్ట్రాసోనిక్ వైబ్రేషన్ ద్వారా ఆవిరిని మాత్రమే ఉత్పత్తి చేస్తుందని చెబుతున్నారు. సాధారణంగా ఆస్తమా బాధితులకు ఊపిరి సరిగా ఆడనప్పుడు ఈ పరికరాన్ని ఉపయోగించి, వాయునాళంలో అవాంతరాలు తొలగించి ఊపిరాడేలా చేస్తారు. అంతేగాని దీనివల్ల ప్రత్యేకంగా ఆక్సిజన్ ఏమీ ఉత్పత్తి కాదని, తెలిసీతెలియక దీనిని ఉపయోగిస్తే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే అవుతుందని అంటున్నారు.
తాజా వీడియో వైరల్ అవ్వడంతో అలోక్ సేథి వివరణ ఇచ్చారు. తాను ఆక్సిజన్ సిలిండర్కు బదులుగా నెబులైజర్ను వాడుకోవచ్చు అని చెప్పలేదని, నెబ్యులైజర్ ఎలా ఉపయోగించాలో చెబుతూ వీడియో తీసి ఓ వ్యక్తికి పంపానని, అలా అది వైరల్ అయ్యిందని చెప్పారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి వీడియోలు వైరల్ చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.