NEET 2023: నీట్‌ (యూజీ) నోటిఫికేషన్‌ వచ్చేసింది.. దరఖాస్తులు మొదలయ్యాయ్‌..

వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్‌ (యూజీ)-2023 పరీక్షకు నోటిఫికేషన్‌ విడుదలైంది. 13 భాషల్లో జరిగే ఈ పరీక్షకు దరఖాస్తులు నేటి నుంచి మొదలయ్యాయ్‌..

Updated : 06 Mar 2023 22:09 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) యూజీ (NEET UG 2023) పరీక్షకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పరీక్షను మే 7న నిర్వహించనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) సోమవారం అధికారికంగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంగ్లిష్‌, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను పెన్ను, పేపర్‌ విధానంలో నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు https://neet.nta.nic.in/  క్లిక్‌ చేయండి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులను మార్చి 6 నుంచి ఏప్రిల్‌ 6 వరకు స్వీకరించనున్నారు. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుం రూ.1700 కాగా, జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ-ఎన్‌సీఎల్‌ అభ్యర్థులకు రూ.1600, ఎస్సీ, ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/థర్డ్‌ జండర్‌ అభ్యర్థులకు రూ.100 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇతర దేశాలకు చెందిన అభ్యర్థులైతే దరఖాస్తు రుసుం రూ.9500లుగా నిర్ణయించారు. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌, పరీక్ష కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో వెల్లడించనున్నారు. నీట్ పరీక్ష మే 7న (ఆదివారం) మధ్యాహ్నం 2గంటల నుంచి 5.20 గంటల మధ్య జరగనుంది. 

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గత ఐదేళ్లుగా ఈ పరీక్ష రాసేవారి సంఖ్య ఏటా పెరుగుతోంది. గతేడాది 17.64లక్షల మంది నీట్‌ యూజీ పరీక్ష రాయగా.. ఈ ఏడాది 18లక్షల మంది రాసే అవకాశం ఉందని ఓ అంచనా. నీట్‌కు దరఖాస్తు చేసుకున్న తర్వాత కన్ఫర్మేషన్‌ పేజీని డౌన్‌లోడ్‌ చేసుకొని భద్రపరచుకోండి. అలాగే, అప్‌లోడ్‌ చేసిన ఫొటో కాపీని సైతం మీ వద్దే ఉంచుకోండి. ఆ డాక్యుమెంట్లు తర్వాత అవసరమవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని