బిల్లు ₹2 వేలు.. టిప్పు ₹11 లక్షలు..!

ఏదైనా హోటల్‌కు వెళ్తే బిల్లు చెల్లించే సమయంలో సర్వర్ టిప్పు అడగడం ఈ రోజుల్లో సాధారణమే. చాలామంది తాము చెల్లించే బిల్లులో 10 నుంచి 20 శాతం సొమ్మును టిప్పుగా ఇస్తుంటారు. 

Published : 25 Jun 2021 01:13 IST

ఇంటర్నెట్ డెస్క్: ఏదైనా హోటల్‌కు వెళ్తే బిల్లు చెల్లించే సమయంలో సర్వర్ టిప్పు అడగడం ఈ రోజుల్లో సాధారణమే. చాలామంది తాము చెల్లించే బిల్లులో 10 నుంచి 20 శాతం సొమ్మును టిప్పుగా ఇస్తుంటారు. కొందరు అంతకన్నా ఎక్కువ ఇస్తే.. అసలేమీ ఇవ్వనివారినీ మనం చూస్తుంటాం. కానీ ఓ వ్యక్తి తాను చెల్లించాల్సిన బిల్లు కంటే దాదాపు 400 రెట్లు డబ్బును టిప్పుగా ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. తన ఉనికిని సైతం గోప్యంగా ఉంచాడు. అయితే ఇది జరిగింది అమెరికాలోని న్యూ హాంప్‌షైర్‌లోని ఓ రెస్టారెంట్‌లో. ఆ బిల్లు ఫొటోను రెస్టారెంట్ యజమాని ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది. నెటిజన్లంతా ఆ కస్టమర్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 

న్యూ హాంప్‌షైర్‌లోని స్టంబుల్‌ ఇన్‌ బార్ అండ్‌ రెస్టారెంటుకు ఇటీవల ఓ కస్టమర్‌ వచ్చాడు. ఓ పానీయం, మరికొన్ని ఆహార పదార్థాలను ఆర్డర్‌ చేశాడు. అందుకు బిల్లు 37 డాలర్లు (సుమారు రూ.2700) అయ్యిందంటూ రెస్టారెంటులో వెయిటర్‌గా పని చేస్తున్న ఓ మహిళ దానిని అయనకు ఇచ్చింది. దానిపై ఆ కస్టమర్‌ టిప్పుగా 16 వేల డాలర్లు (సుమారు రూ.11 లక్షలు) ఇస్తున్నట్లు రాశాడు. ‘ఈ డబ్బును అంతా ఒకే చోట ఖర్చు చేయకు’ అని ఆయన చెప్పడంతో ఆ మహిళ దానిని చూసింది. అంతే.. అందులో టిప్పుగా రాసిన మొత్తాన్ని చూసి ఆమె అవాక్కయింది. విషయం తెలుసుకున్న రెస్టారెంట్ యజమాని ఆ టిప్పును తన సిబ్బందికి పంచాడు. ఆయన దాతృత్వాన్ని కొనియాడుతూ ఫేస్‌బుక్‌లో ఆ బిల్లు ఫొటోను షేర్‌ చేశాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని