Viveka Murder case: వివేకా హత్య కేసు విచారణకు కొత్త సిట్‌..

వివేకా హత్య కేసు విచారణకు సీబీఐ ప్రతిపాదించిన కొత్త సిట్‌కు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. కొత్తగా ఏర్పాటు చేసిన సిట్‌ బృందానికి సీబీఐ డీఐజీ కె.ఆర్‌.చౌరాసియా నేతృత్వం వహిస్తారు.

Updated : 29 Mar 2023 15:08 IST

దిల్లీ: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌ను సీబీఐ తప్పించింది. ఈ మేరకు ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేస్తూ సీబీఐ ఇచ్చిన ప్రతిపాదనకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది.  కొత్తగా ఏర్పాటు చేసిన సిట్‌కు సీబీఐ డీఐజీ కె.ఆర్‌.చౌరాసియా నేతృత్వం వహించనున్నారు. సిట్‌ బృందంలో ఎస్పీ వికాస్‌ సింగ్‌, అడిషనల్‌ ఎస్పీ ముఖేశ్‌ కుమార్‌, ఇన్‌స్పెక్టర్లు ఎస్‌.శ్రీమతి, నవీన్‌ పునియా, ఎస్సై అంకిత్‌ యాదవ్‌ కూడా ఉన్నారు.  

ఏప్రిల్‌ 30లోపు దర్యాప్తు ముగించాలి..

కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివేకా హత్య కేసులో విస్తృత కుట్ర కోణాన్ని బయటపెట్టాలని ఆదేశించింది. ఏప్రిల్‌ 30లోపు వివేకా హత్య కేసు దర్యాప్తు ముగించాలని నిర్దేశించింది. ఇప్పటికే ఈ కేసు విచారణ ఆలస్యమవుతోందని.. కాబట్టే కాలపరిమితిని విధిస్తున్నట్లు తెలిపింది.

మరోవైపు కేసు విచారణ ఆలస్యమవుతున్నందున ఏ5 నిందితుడు శివశంకర్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన భార్య తులసమ్మ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సుప్రీం ఆదేశాల ప్రకారం.. 6నెలల్లోపు ట్రయల్‌ మొదలుకాకపోతే సాధారణ బెయిల్ పిటిషన్‌ వేసుకోవచ్చని అవకాశం ఇచ్చింది. అయితే, మెరిట్స్‌ ఆధారంగానే బెయిల్‌పై నిర్ణయం ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రభావం బెయిల్‌ పిటిషన్‌పై ఉండదని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు