Curfew: తెలంగాణలో నేటి నుంచి రాత్రి వేళ!

తెలంగాణలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి మే 1 వరకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల కర్ఫ్యూ విధిస్తున్నట్లు

Updated : 20 Apr 2021 13:14 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈరోజు నుంచి మే ఒకటో తేదీ ఉదయం 5గంటల వరకు ప్రతి రోజూ రాత్రి కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. రాత్రి 8 గంటలకే కార్యాలయాలు, దుకాణాలు, హోటళ్లు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కర్ఫ్యూ నుంచి ఫార్మసీలు, ల్యాబ్‌లు, మీడియా, పెట్రోల్‌ బంక్‌లు, శీతల గిడ్డంగులు, గోదాములు, అత్యవసర సర్వీసులకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. టికెట్‌ కలిగిన విమాన, రైలు, బస్సు ప్రయాణికులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లే రోగులకు ఎలాంటి ఆంక్షలు ఉండవు.

అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు లేవు: ప్రభుత్వం

అంతర్రాష్ట్ర రవాణాకు ఎలాంటి అనుమతులు అవసరంలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎలాంటి పాసులు అవసరం లేదని తెలిపింది.  కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల రాత్రి కర్ఫ్యూ విధించాయి. తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి చాపకిందనీరులా విస్తరిస్తోంది. నిన్న ఒక్క రోజే కొత్తగా 5,926 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్న  కరోనాతో 18 మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 1,856కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 42,853 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో నిన్న కొత్తగా 793 మంది వైరస్‌ బారిన పడ్డారు. 

హైకోర్టు ఆదేశాలతో నిర్ణయం..

 కొవిడ్‌ నియంత్రణలో ఉదాసీనతపై సోమవారం హైకోర్టు మండిపడింది. 10 రోజుల సమయం ఇచ్చినా ఏ ఒక్క ఆదేశం అమలు చేయలేదని తప్పుపట్టింది. మీరు చేయకపోతే మేం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. రాజకీయర్యాలీలు.. బార్లు.. సినిమా హాళ్లు... పెళ్లిళ్లు.. అంత్యక్రియల్లో రద్దీని ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించింది.  ‘‘మద్యం దుకాణాల్లో వచ్చే ఆదాయంపై ఉన్న దృష్టి ప్రజల ప్రాణాలపై లేదా? వారంరోజుల్లో కేసులు రెట్టింపయ్యాయి. ఇంట్లోనే రక్షణ ఉండడంలేదు’’ అని పేర్కొంది. కోర్టుకు ఇచ్చిన నివేదికలో సరైన వివరాలు ఇవ్వకపోవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. తీసుకుంటున్న చర్యలపై జిల్లాలవారీగా పరీక్షలు ఎన్ని, పాజిటివ్‌లు ఎన్నెన్నో వివరాలడిగితే ఇవ్వలేదంది. ఓ వైపు ఆరోగ్యశాఖ మంత్రి ఆక్సిజన్‌ నిల్వలు లేవని చెబుతుంటే మరోవైపు ఆక్సిజన్‌ తగినంత ఉందని ఆరోగ్యశాఖ కోర్టుకు చెబుతోందని, దీనిపై స్పష్టత ఇవ్వాలని, రెమ్‌డెసివిర్‌ కొరతపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దిల్లీలో పరిస్థితి చూస్తూ కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? రాత్రిపూట.. వారాంతాల్లో కర్ఫ్యూ వంటి నియంత్రణ చర్యలు ఎందుకు తీసుకోలేదు? మీరు చర్యలు తీసుకుంటారా? లేక మమ్మల్ని ఆదేశాలివ్వమంటారా? ఈ పనులన్నీ చేయాల్సిన బాధ్యత మీది.. మమ్మల్ని ఎందుకు ఇందులోకి లాగుతున్నారు? 48 గంటల్లో నిర్ణయం తీసుకోండి అని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కరోనాకట్టడిపై కీలక నిర్ణయం తీసుకుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని