యాంటీబాడీలు వృద్ధి చెందలేదని పూనావాలాపై కేసు

కరోనా టీకా కొవిషీల్డ్‌ను తీసుకున్నా తనకు యాంటీబాడీలు వృద్ధి చెందలేదని సీరం సంస్థ సీఈఓ అదర్‌ పూనావాలాపై ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి కేసు వేశారు. ఆ టీకాను అభివృద్ధి చేసిన పూనావాలాతోపాటు డీసీజీఏ డైరెక్టర్‌, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌, ఐసీఎంఆర్‌ డైరక్టర్‌ బలరాం భార్గవ, నేషనల్ హెల్త్ మిషన్ డైరక్టర్ అపర్ణ ఉపాధ్యాయపై లఖ్‌నవూలోని ఆషియానా పోలీసు స్టేషన్‌లో ప్రతాప్‌ చంద్ర అనే వ్యక్తి కేసు వేశారు.

Published : 01 Jun 2021 01:39 IST

ప్లేట్‌లెట్లు సగానికి తగ్గాయని ఆరోపణ

లఖ్‌నవూ: కరోనా టీకా కొవిషీల్డ్‌ను తీసుకున్నా తనకు యాంటీబాడీలు వృద్ధి చెందలేదని సీరం సంస్థ సీఈఓ అదర్‌ పూనావాలాపై ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి కేసు వేశారు. ఆ టీకాను అభివృద్ధి చేసిన పూనావాలాతోపాటు డీసీజీఏ డైరెక్టర్‌, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌, ఐసీఎంఆర్‌ డైరక్టర్‌ బలరాం భార్గవ, నేషనల్ హెల్త్ మిషన్ డైరక్టర్ అపర్ణ ఉపాధ్యాయపై లఖ్‌నవూలోని ఆషియానా పోలీసు స్టేషన్‌లో ప్రతాప్‌ చంద్ర అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.

‘ఏప్రిల్‌ 8న కొవిషీల్డ్‌ మొదటి డోసు తీసుకున్నా. అయితే 28 రోజుల తర్వాత రెండో డోసు తీసుకోవాలని మొదట వెల్లడించారు. కానీ ఆ తర్వాత ప్రభుత్వం దానిని ఆరు వారాలకు పొడిగించింది. మళ్లీ దానిని 12 వారాలకు సవరించింది. అయితే మొదటి డోసు తీసుకున్న తర్వాత నా ఆరోగ్యం క్షీణించింది’ అని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కొవిషీల్డ్ మొదటి డోసు తీసుకున్న తర్వాత శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయన్న ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ్ మీడియాతో వెల్లడించిన మాటలను ఉటంకిస్తూ ప్రతాప్‌ చంద్ర కేసు వేశారు.

ప్రభుత్వం ఆమోదించిన ల్యాబ్‌లో కొవిడ్ యాంటీబాడీ పరీక్ష చేసుకొని ఆ ప్రతులను ఫిర్యాదుకు ఆధారంగా జత చేశారు. కాగా ప్రతాప్‌ చంద్రకు యాంటీబాడీలు అభివృద్ధి కాలేదని, బదులుగా అతడి ప్లేట్‌లెట్లు 3 లక్షల నుంచి 1.5 లక్షలకు తగ్గినట్లు ఆ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. కొవిషీల్డ్‌ తీసుకున్నాకే తన ప్లేట్‌లెట్స్‌ సగానికిపైగా పడిపోయాయని ఫిర్యాదుదారుడు ఆరోపించారు. పోలీసులు ప్రతాప్‌ చంద్ర ఫిర్యాదును స్వీకరించారు. కానీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు. కేసు తీవ్రత దృష్ట్యా విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని ఆషియానా పోలీసులు వెల్లడించారు. అయితే కేసు నమోదు చేయకపోతే కోర్టును ఆశ్రయిస్తానని ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని