రామగుండంలో నీటిపై సౌర కాంతులు

పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ నీటిపై తేలియాడే సోలార్‌ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తోంది. బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌పై దేశంలోనే అతిపెద్ద నీటిపై తేలియాడే ఉత్పత్తి కేంద్రం నిర్మాణాన్ని శరవేగంగా కొనసాగిస్తోంది....

Published : 13 Mar 2021 15:21 IST

శరవేగంగా పూర్తవుతున్న నిర్మాణం

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో విద్యుత్తు డిమాండ్‌ ఎప్పటికప్పుడు పెరిగిపోతోంది. కాగా మన అవసరాలు తీర్చేందుకు థర్మల్‌ విద్యుత్తుపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. బొగ్గు ఆధారిత ఉత్పత్తి కేంద్రాల వల్ల కాలుష్యంతోపాటు ఇతర సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిని అధిగమిస్తూ భవిష్యత్తు డిమాండ్‌ను అందుకునేందుకు సౌర విద్యుత్తుపై ప్రభుత్వాలు దృష్టిసారించాయి. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ నీటిపై తేలియాడే సోలార్‌ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తోంది. బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌పై దేశంలోనే అతిపెద్ద నీటిపై తేలియాడే ఉత్పత్తి కేంద్రం నిర్మాణాన్ని శరవేగంగా కొనసాగిస్తోంది. 100 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్లాంట్‌లో మే నెల నుంచి ఉత్పత్తి ప్రారంభం కానుంది.

దేశవ్యాప్తంగా 450 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలని ఎన్టీపీసీ నిర్ణయించింది. వీటిలో రిజర్వాయర్లపైనే 217 మెగావాట్ల సామర్థ్యంతో ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్ల నిర్మాణాన్ని తలపెట్టింది. ఇందులో రామగుండంలోని ఎన్టీపీసీలోని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ ఉపరితలంపై 100 మెగావాట్ల ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుతోంది. 450 ఎకరాల విస్తీర్ణంలో రూ.430 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణానికి పూనుకొంది. ఈ నిర్మాణం ఇప్పటికే పూర్తికావాల్సి ఉండగా కొవిడ్‌ కారణంగా ఆలస్యమైనట్లు ఓ అధికారి పేర్కొన్నారు.

సాధారణంగా ఒక మెగావాట్‌ ఉత్పత్తికి ఐదెకరాల భూమి అవసరం కానుండగా, నీటిపై తేలియాడే ప్లాంట్లకు పెద్దగా భూ సేకరణ అవసరం ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. రామగుండంతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో మరిన్ని ఫ్లోటింగ్‌ సోలార్‌ యూనిట్లను నిర్మించే దిశగా ఎన్టీపీసీ ప్రాణాళికలు సిద్ధం చేసింది. కేరళలోని కయంకుళంలో 92 మెగావాట్లు, సింహాద్రిలో 25 మెగావాట్ల యూనిట్లను ఎన్టీపీసీ ఏర్పాటుచేస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని