Hyderabad: ఎన్టీఆర్ కుమార్తెది ఆత్మహత్యే.. పోలీసులకు చేరిన పోస్టుమార్టం నివేదిక

ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఊమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది.

Updated : 05 Aug 2022 18:50 IST

హైదరాబాద్: ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఉస్మానియా ఫొరెన్సిక్ వైద్యులు జూబ్లీహిల్స్ పోలీసులకు అందించిన నివేదికలో ఈ మేరకు పేర్కొన్నారు. ఈ నెల 1వ తేదీన ఉమా మహేశ్వరి తన గదిలో మృతిచెంది ఉండడాన్ని ఆమె కుటుంబసభ్యులు గుర్తించారు. వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారమిచ్చారు. జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఉమా మహేశ్వరి కూమార్తె దీక్షిత నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. మధ్యాహ్నం 12గంటల సమయంలో గదిలోకి వెళ్లి, భోజన సమయానికి బయటికి రాకపోవడంతో పిలిచామని.. ఎంతకీ తలుపు తీయకపోవడంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూస్తే ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించినట్లు దీక్షిత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత కొంతకాలంగా ఒత్తిడికి గురవడంతో పాటు అనారోగ్య సమస్యలతో ఉమామహేశ్వరి బాధపడుతున్నట్లు దీక్షిత పోలీసులకు తెలిపారు. పోస్టుమార్టం నివేదికలోనూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వైద్యులు తేల్చారు. ముందుగా ఉమా మహేశ్వరిది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఆత్మహత్యగా మార్చి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని