OMC Case: వేగవంతమైన ఓఎంసీ కేసు విచారణ.. నిందితుల డిశ్ఛార్జ్‌ పిటిషన్ల కొట్టివేత

సుప్రీంకోర్టు జోక్యంతో ఓబుళాపురం మైనింగ్‌ కేసు(ఓఎంసీ) కేసు విచారణ ప్రక్రియ వేగవంతమైంది. ఈ కేసులో నిందితుల డిశ్ఛార్జ్‌ పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టేసింది. నిందితుల డిశ్ఛార్జ్‌ పిటిషన్లను కొట్టివేస్తూ అభియోగాల నమోదుపై తదుపరి విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 21కి వాయిదా వేసింది.

Published : 17 Oct 2022 19:37 IST

హైదరాబాద్: సుప్రీంకోర్టు జోక్యంతో ఓబుళాపురం మైనింగ్‌ కేసు(ఓఎంసీ) విచారణ ప్రక్రియ వేగవంతమైంది. ఈ కేసులో నిందితుల డిశ్ఛార్జ్‌ పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టేసింది. ఓఎంసీ కేసు నుంచి తొలగించాలన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభ్యర్థనను తోసిపుచ్చిన కోర్టు.. ఆమె దాఖలు చేసిన డిశ్ఛార్జ్‌ పిటిషన్‌ను కొట్టేసింది. ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి, విశ్రాంత అధికారులు కృపానందం, వి.డి.రాజగోపాల్, గాలి జనార్దన్‌ రెడ్డి పీఏ అలీఖాన్‌ దాఖలు చేసిన డిశ్ఛార్జ్‌ పిటిషన్లనూ సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన గాలి జనార్దన్, బి.వి.శ్రీనివాస్‌రెడ్డి డిశ్ఛార్జ్‌ పిటిషన్లను గతంలోనే ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. 

అనంతపురం జిల్లా డి.హీరేహాళ్‌, ఓబుళాపురం మండలాల్లో ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ అక్రమ మైనింగ్‌కు పాల్పడిన కేసులోని నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై ఇటీవల హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో వాదనలు జరిగాయి. ఓఎంసీ కేసులో అన్నీ చట్ట ప్రకారమే జరిగాయని, సీబీఐవి ఊహాజనిత ఆరోపణలేనని, చట్ట ప్రకారం లీజులు మంజూరు చేశారని నిందితుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ వాదనలతో సీబీఐ న్యాయవాది విభేదిస్తూ గాలి జనార్దన్‌రెడ్డికి నిందితులందరూ సహకారం అందించారన్నారు. ఏపీ, కర్ణాటకల సరిహద్దులను చెరిపేసి గాలి జనార్దన్‌రెడ్డి కంపెనీ అక్రమ తవ్వకాలు చేసిందని, ఏపీ లైసెన్సుల ఆధారంగా అక్రమ రవాణా జరిగిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసు ప్రాథమిక దశలోనే ఉన్నందువల్ల నిందితుల డిశ్ఛార్జ్‌ పిటిషన్లను కొట్టేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి నిందితులు తమ అభ్యంతరాలను రాతపూర్వకంగా సమర్పించవచ్చని పేర్కొంటూ డిశ్ఛార్జ్‌ పిటిషన్లపై ఉత్తర్వులను అక్టోబరు 17న వెల్లడిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణ చేపట్టిన సీబీఐ న్యాయస్థానం నిందితుల డిశ్ఛార్జ్‌ పిటిషన్లను కొట్టివేస్తూ అభియోగాల నమోదుపై తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు