Telangana News: టెన్త్‌ పరీక్షల్లో కీలక మార్పులు.. ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు

తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణ విధానంలో పాఠశాల విద్యాశాఖ మార్పులు చేసింది. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి శ్రీదేవసేన సర్క్యులర్‌ జారీ చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్త విధానం అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Published : 03 Nov 2022 01:06 IST

హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షల విధానంలో పాఠశాల విద్యా శాఖ కీలక మార్పులు చేసింది. పది వార్షిక పరీక్షలను ఇకపై ఆరు పేపర్లతోనే నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యా శాఖ సంచాలకులు శ్రీదేవసేన వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఆరు పేపర్ల నిబంధన అమల్లోకి వస్తుందని.. ఈ మేరకు జిల్లాల డీఈవోలు, విద్యా శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. 9, 10వ తరగతుల విద్యార్థులకు నిర్వహించే సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌-2(ఎస్‌ఏ-2) పరీక్షలు కూడా 6 పేపర్లతోనే నిర్వహించాలని  ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇప్పటివరకు పదో తరగతిలో 11పేపర్లతో పరీక్షలు నిర్వహించారు. ద్వితీయ భాష మినహా ప్రథమ, తృతీయ భాష, గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రాలు రెండు పేపర్లుగా విద్యార్థులు రాస్తున్నారు. కొవిడ్ పరిస్థితుల వల్ల పూర్తిస్థాయి బోధన జరగకపోవడంతో గతేడాది ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించారు. 11 పేపర్లు రాయడం వల్ల విద్యార్థులపై భారం పడుతోందని.. 6 పేపర్లకు కుదించాలని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ(ఎస్‌సీఈఆర్‌టీ) విద్యా శాఖ ముందు ప్రతిపాదనలు ఉంచింది. ఎస్‌సీఈఆర్‌టీ చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన విద్యా శాఖ ఆరు పేపర్లకు కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, సామాన్య శాస్త్రం పరీక్షలో భౌతిక, జీవశాస్త్రాలకు వేర్వేరు సమాధాన పత్రాలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని