చదువుల తల్లి మురిసింది

కరోనాతో ప్రభుత్వ కళాశాలల్లో అతిథి అధ్యాపకుల సేవలు నిలిచిపోయాయి. నెలలు గడిచినా సర్కారు నియామకాలు చేపట్టలేదు. ఈ పరిస్థితుల్లో పాఠ్యాంశాలు చెప్పేవారు లేక విద్యార్థులు పడుతున్న కష్టాలను వారి తల్లిదండ్రులు దూరం చేశారు....

Updated : 26 Mar 2021 16:26 IST

ఒప్పంద అధ్యాపకులను నియమించిన తల్లిదండ్రులు

ఇంటర్నెట్ డెస్క్‌: కరోనాతో ప్రభుత్వ కళాశాలల్లో అతిథి అధ్యాపకుల సేవలు నిలిచిపోయాయి. నెలలు గడిచినా సర్కారు నియామకాలు చేపట్టలేదు. ఈ పరిస్థితుల్లో పాఠ్యాంశాలు చెప్పేవారు లేక విద్యార్థులు పడుతున్న కష్టాలను వారి తల్లిదండ్రులు దూరం చేశారు. అందరూ కొంతమేర డబ్బులు వేసుకొని అధ్యాపకులను నియమించి పిల్లలకు పాఠాలు చెప్పిస్తున్నారు. విజయనగరం జిల్లా సాలూరు మండలం పురోహితుని వలసలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులు ఇంటర్‌ వరకు విద్యనభ్యసిస్తున్నారు. కరోనాకు ముందు ప్రభుత్వ అధ్యాపకులతోపాటు అతిథి అధ్యాపకులు బోధించేవారు. వీరిని  ప్రభుత్వం ప్రస్తుతం నిలిపివేయడంతో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, జువాలజీ, సివిక్స్‌, ఎకనమిక్స్‌, ఆంగ్లం చెప్పేవారు లేకుండాపోయారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసినా ఫలితం లేకుండాపోయింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తలా కొంత సొమ్ము వేసుకొని ఒప్పంద ప్రాతిపదికన అధ్యాపకులను నియమించుకున్నారు. ప్రస్తుతం పిల్లల చదువులు సజావుగా సాగుతున్నాయి.

ఒక్కో విద్యార్థి తరఫున రూ.500 ఇస్తున్నారు. వీరికి తోడుగా ప్రిన్సిపల్‌ నెలకు రూ.5000, అధ్యాపకులు రూ.1500, రూ.1000 చొప్పున ఇస్తున్నారు. ప్రస్తుతం అన్ని సబ్జెక్టులు చెబుతుండటంతో తల్లిదండ్రులు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారంపై విద్యార్థుల తల్లిదండ్రుల చొరవను ప్రిన్సిపల్‌ అభినందిస్తున్నారు. ప్రభుత్వంపై ఆధారపడకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, కళాశాల అధ్యాపకులు తీసుకున్న నిర్ణయంపై స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని