సరిహద్దుల వరకే బస్సులు: పేర్నినాని

తెలంగాణలో స్థిరపడిన వారు దసరాకు ఏపీకి వెళ్లేందుకు చూస్తున్నారని ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్నినాని అన్నారు. ఈ మేరకు బస్సులు నడపాలని భావించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వంతో..

Published : 25 Oct 2020 02:18 IST

హైదరాబాద్‌: తెలంగాణలో స్థిరపడిన వారు దసరాకు ఏపీకి వెళ్లేందుకు చూస్తున్నారని ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్నినాని అన్నారు. ఈ మేరకు బస్సులు నడపాలని భావించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం ఇంకా కుదరనందువల్ల అది సాధ్యపడలేదని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో నాని మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ-తెలంగాణ సరిహద్దుల వద్ద ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచామన్నారు. పంచలింగాల, గరికపాడు,వాడపల్లి, పైలాన్‌, జీలుగుమిల్లి, కల్లుగూడెం చెక్‌పోస్టు వద్ద బస్సులు ఉంటాయన్నారు. ప్రయాణికులు సరిహద్దు వద్దకు వస్తే చెక్‌పోస్టుల వద్ద విరివిగా బస్సులు అందుబాటులో ఉంచామన్నారు. ఈ మేరకు ఆంధ్రా సరిహద్దు వరకు బస్సులు నడపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

సరిహద్దు నుంచి గ్రామాలకు చేరవేసేందుకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచుతామని పేర్ని నాన్ని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి కర్ణాటక, తమిళనాడుకు బస్సుల పునరుద్ధరణ ఇప్పటికే జరిగిందని, తెలంగాణలో సర్వీసులు నడిపేందుకు జూన్‌ 18 నుంచి అక్కడి అధికారులతో ఏపీ అధికారులు చర్చిస్తున్నారని మంత్రి వెల్లడించారు. కనీసం పండగవరకైనా బస్సులు నడపాలని తెలంగాణ  అధికారులను కోరామని, వరుసగా మూడు రోజులు సెలవులు కావడంతో జాప్యమైందని నాని అన్నారు. మంగళవారం రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు చర్చించే అవకాశముందన్నారు. టీఎస్‌ఆర్టీసీతో చర్చలు జరిపాక తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏపీఎస్‌ ఆర్టీసీ లాభనష్టాల కోసం చూడట్లేదని, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని మీడియాకు తెలిపారు. ఇటీవల ఏపీలో తీసుకొచ్చిన నూతన ట్రాఫిక్‌ నిబంధనలపై మాట్లాడుతూ.. ట్రాఫిక్‌ ఆంక్షలను పాటించకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారిపై చర్యల కోసమే నిబంధనలు కఠినతరం చేశామని అన్నారు. ఈ అంశాన్ని కూడా రాజకీయం చేయడం తగదన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని