
Raghurama: జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ను వెనక్కి ఇచ్చిన హైకోర్టు రిజిస్ట్రీ
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, సాంకేతిక కారణాలతో రఘురామ పిటిషన్లను హైకోర్టు రిజిస్ట్రీ వెనక్కి ఇచ్చారు.
జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఆయన గతంలో సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ న్యాయస్థానంలో మూడు నెలలుగా సుదీర్ఘ విచారణ జరిగింది. బెయిల్ మంజూరు చేసిన సందర్భంలో సీబీఐ కోర్టు విధించిన షరతులను జగన్, విజయసాయిరెడ్డి ఉల్లంఘించారని.. అందువల్ల వారి బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాదులు వాదించారు. అయితే తాము ఎలాంటి షరతులు ఉల్లంఘించలేదని.. కేవలం రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రఘురామ పిటిషన్ దాఖలు చేశారని జగన్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం రఘురామరాజు పిటిషన్ను కొట్టేసింది. దీంతో సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు.