‘మోనాలిసా’ కోసం పికాసోను అరెస్టు చేశారు

మోనాలిసా.. ఈ పేరు తెలియని, ఆమె చిత్రపటం చూడని వారుండరు. ఎంతో అందమైన అద్భుతమైన ఈ మోనాలిసా చిత్రపటం చాలా మంది ఇళ్లలోనూ పెట్టుకుంటారు. కొన్ని శతాబ్దాల కిందట ఇటలీకి చెందిన ప్రముఖ చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ గీసిన ఈ చిత్రంపై

Updated : 26 Nov 2020 11:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మోనాలిసా.. ఈ పేరు తెలియని, ఆమె చిత్రపటం చూడని వారుండరు. ఎంతో అందమైన అద్భుతమైన ఈ మోనాలిసా చిత్రపటాన్ని చాలా మంది ఇళ్లలోనూ పెట్టుకుంటారు. కొన్ని శతాబ్దాల కిందట ఇటలీకి చెందిన ప్రముఖ చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ గీసిన ఈ చిత్రంపై ఇప్పటికీ ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలున్నాయి. కొందరు ఆమె ఇటలీలోని ఫ్లోరెన్స్‌కి చెందిన ప్రముఖ వ్యక్తి సతీమణి అని, డావిన్సీతో ఆ చిత్రం గీయించారని చెబుతారు. మరికొందరు అదో ఊహాచిత్రమంటూ అనేక వాదనలు వినిపిస్తున్నారు. ఈ వాదనలు పక్కనపెడితే, అసలు మోనాలిసా ఎందుకంతా పాపులర్‌ అయింది?ఆ చిత్రానికి పికాసోకు సంబంధం ఏంటి? ఆయన్ను ఎందుకు అరెస్టు చేశారు? తెలుసుకుందాం పదండి..

మోనాలిసా చిత్రపటాన్ని లియోనార్డో డావిన్సీ 1503-17 మధ్య గీశాడని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే, ఈ చిత్రాన్ని అప్పటి ఫ్రాన్స్‌ చక్రవర్తి కింగ్‌ ఫ్రాంకోయిస్‌-I స్వాధీనం చేసుకొని తన అంతఃపురంలో పెట్టుకున్నాడు. ఆ తర్వాత మోనాలిసా చిత్రపటం ఎక్కడెక్కడో తిరిగి చివరికి 1797లో ఫ్రాన్స్ లో పారిస్‌లోని లూవర్‌ మ్యూజియానికి చేరుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అందులోనే ఈ చిత్రపటాన్ని భద్రపర్చారు. మధ్యలో నెపోలియన్‌.. తన పడకగదిలో మోనాలిసా చిత్రాన్ని పెట్టుకున్నాడట. 1860లో మ్యూజియంలో కనిపించిన మోనాలిసా చిత్రాన్ని చూసి అప్పటి మేధావులు, చిత్రకారులు అదో గొప్ప కళాఖండంగా అభివర్ణించారు.

చిత్రపటం చోరీ.. పికాసో అరెస్టు

అయితే, 1911 వరకు మోనాలిసా గురించి ఫ్రాన్స్‌కు తప్ప ప్రపంచానికి పెద్దగా తెలియదు. మ్యూజియంలో మోనాలిసా చిత్రం చోరీకి గురైన ఘటనతో ప్రపంచవ్యాప్తంగా ప్రాచూర్యం పొందింది. ఆ ఏడాది ఆగస్టు 21న లూవర్‌ మ్యూజియంలో ఉన్న మోనాలిసా చిత్రపటాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. ప్రదర్శనకు పెట్టిన చోట పటం కనిపించకపోవడంతో మొదట దాన్ని ఫొటోషూట్‌కు తీసుకెళ్లారని నిర్వాహకులు భావించారట. ఎంత సేపటికి చిత్రం తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా మ్యూజియంను వారంరోజులపాటు మూసివేశారు. దర్యాప్తులో పోలీసులు ఫ్రెంచ్‌ రచయిత గులిలైమ్‌ అపోలినైర్‌ను అనుమానించారు. ఎందుకంటే, అపోలినైర్‌కు మ్యూజియం నుంచి చిత్రాలు దొంగిలించి విక్రయించే వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి. దీంతో అతడి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అపోలినైర్‌ తన స్నేహితుడు, ప్రముఖ చిత్రకారుడు పాబ్లో పికాసో పేరు చెప్పాడు. పికాసో కూడా దొంగిలించిన చిత్రాలను గతంలో కొనుగోలు చేశాడట. ఈ నేపథ్యంలో పోలీసులు పికాసోను అరెస్టు చేశారు. అయితే, చివరికి మోనాలిసా చిత్రపటాన్ని దొంగిలించింది మ్యూజియం సిబ్బందే అని తెలియడంతో పికాసోను విడుదల చేశారు. మ్యూజియంలో మోనాలిసా చిత్రానికి ఫ్రేమ్‌ తయారు చేయడంలో సహాయపడ్డ సిబ్బందిలో ఒకడైన వెన్సెంజో పెరుగ్వా ఈ చోరీలో ప్రధాన నిందితుడు. ఇతడు ఇటలీ దేశస్థుడు. లియోనార్డో కూడా ఇటాలియన్‌ కావడంతో ఆయన గీసిన చిత్రం ఇటలీలోనే ఉండాలనే ఉద్దేశంతో మోనాలిసా చిత్రాన్ని దొంగిలించాడట. 

నకిలీల సృష్టి.. మోనాలిసాకు ప్రాచూర్యం

వెన్సెంజో ఆ చిత్రాన్ని రెండేళ్ల పాటు తన ఇంట్లో దాచిపెట్టాడు. ఆ సమయంలో ఈ చోరీతో సంబంధం ఉన్న మరికొందరు మోనాలిసా చిత్రాలకు నకళ్లు సృష్టించి అమెరికాలో విక్రయించారట. ఆ తర్వాత నిజమైన చిత్రాన్ని ఫ్లోరెన్స్‌లోని మ్యూజియం డైరెక్టర్‌కు అమ్మేశారు. దాన్ని 1913లో కొన్నివారాలపాటు మ్యూజియంలో ప్రదర్శించారు. ఈ విషయం తెలిసి పోలీసులు వెన్సెంజోను అరెస్టు చేసి చిత్రాన్ని తిరిగి లూవర్‌ మ్యూజియానికి అప్పగించారు. మోనాలిసా చిత్రం చోరీ కేసులో ప్రముఖ చిత్రకారుడు పాబ్లో పికాసో అరెస్టు, ఈ కేసును పోలీసులు ఛేదించిన తీరుపై పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించడంతో అంతర్జాతీయంగా మోనాలిసా చిత్రానికి ప్రాచూర్యం లభించింది. ఆ చిత్రాన్ని చూడటం కోసం ప్రజలు మ్యూజియానికి రావడం మొదలుపెట్టారు.

రెండో ప్రపంచ యుద్ధం సమయంలో లూవర్‌ మ్యూజియం నుంచి మోనాలిసా చిత్రాన్ని ఇతర ప్రాంతాలకు తరలించి కొన్నాళ్లకు మళ్లీ తీసుకొచ్చి అదే మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. ఇప్పటికీ నిజమైన మోనాలిసా చిత్రపటం అక్కడే బుల్లెట్ ప్రూఫ్ అద్దాల ఫ్రేమ్ లో ఉండగా.. నకిలీ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇదండీ మోనాలిసా చిత్రం పాపులర్‌ అవడానికి వెనకున్న అసలు కథ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని