పోలవరం కేసు సుప్రీంకు బదిలీ చేయం: ఎన్జీటీ

పోలవరం ముంపు బాధితులకు ఆరునెలల్లో పునరావాసం, పరిహారం చెల్లించాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశించింది. ఏపీలో బాధితులకు...

Published : 18 Sep 2020 14:06 IST

దిల్లీ: పోలవరం ముంపు బాధితులకు ఆరునెలల్లో పునరావాసం, పరిహారం చెల్లించాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశించింది. ఏపీలో బాధితులకు పునరావాసం, పరిహారంపై పెంటపాటి పుల్లారావు, తెలంగాణలో ముంపు ప్రభావానికి సంబంధించి పొంగులేటి సుధాకర్‌రెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లపై శుక్రవారం ఎన్జీటీ విచారణ చేపట్టింది.

ముంపు ప్రభావంపై ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీ నివేదికను ఎన్జీటీ ఆమోదించింది. కేసును సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలన్న కమిటీ ప్రతిపాదనను ఎన్జీటీ తోసిపుచ్చింది. అంతర్రాష్ట్ర జలవివాదాల జోలికి వెళ్లకుండా  పర్యావరణంపై ప్రభావం, బాధితులకు పరిహారం అంశాలపై విచారిస్తామని స్పష్టం చేసింది. రెండు నెలల్లో పోలవరం ప్రాజెక్టుకు ఎగువరాష్ట్రాలైన తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించింది.  కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, గోదావరి జలవివాదాల ట్రైబ్యునల్‌, ఏపీ జలవనరులశాఖ సంయుక్తంగా ఈ సమావేశం నిర్వహించాలని సూచించింది. ఎగువ రాష్ట్రాల సందేహాలను తీర్చాలన్న కమిటీ సిఫార్సులకు ఎన్జీటీ ఆమోదం తెలిపింది. పోలవరం పూర్తయితే  భద్రాచలం వద్ద గోదావరి నదికి ఇరు వైపులా ఉన్న ప్రాంతాలు ముంపునకు గురయ్యే అంశంపై తెలుగురాష్ట్రాలు చర్చించి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని