Corona: కొవిడ్తో నాడీవ్యవస్థ కుదేలు
కరోనా వైరస్ ప్రభావం ఊపరితిత్తులు, గుండె మీదనే కాకుండా నాడీ వ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది.
ఇంటర్నెట్డెస్క్: కరోనా వైరస్ ప్రభావం ఊపిరితిత్తులు, గుండె మీదనే కాకుండా నాడీ వ్యవస్థను కూడా దెబ్బతీస్తోంది. కరోనా వచ్చాక వాసన, రుచి కోల్పోవడం మనకు తెలిసిందే. ఈ రెండు లక్షణాలు కరోనా వైరస్ మెదడు మీద ప్రభావం చూపడం వల్లే కనిపిస్తాయి. అయితే ఇవి మాత్రమే కాదు మెదడు మీద దుష్ప్రభావాలు చాలానే ఉంటాయని అంటున్నారు వైద్యులు. కరోనా వైరస్ కారణంగా మెదడు, నాడీ మండల పైన కనిపించే సమస్యలు వాటిని అధిగమించే మార్గాల గురించి తెలుసుకుందాం!
కరోనా మొదటి వేవ్లో డాక్టర్లు ప్రధానం ఊపిరితిత్తులు, గుండెను కాపాడటం మీద దృష్టి పెట్టారు. ఆక్సిజన్, హై కాన్సన్ట్రేషన్ ఆక్సిజన్ అందించి చాలా మంది రోగులను వైద్యులు బతికించారు. అయితే అలా కోలుకున్న కొంతమంది రోగుల్లో కాలు, చేయి పనిచేయకపోవడం, మూతి వంకర పోవడం, చుట్టుపక్కల వారిని గుర్తుపట్టక పోవడం వంటి దుష్ప్రభావాలు కనిపించాయి. దాంతో వైద్య నిపుణులు తమ చికిత్సల్లో ఏమైనా అంశాలను విస్మరించారా? అంటూ అధ్యయనాలు మొదలుపెట్టారు. సీటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి అధునాతన వైద్య పరీక్షల సాయంతో అధ్యయనాలు నిర్వహించినపుడు కరోనా ప్రభావం నాడీ మండలంపై ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
నాడీ మండలో కేంద్రీయ నాడీమండలం, పరిధీయ నాడీ మండలం అని రెండు భాగాలుంటాయి. కేంద్రీయ నాడీ మండలంలో మెదడు, వెన్నుపాము, రెటీనా అనే మూడు భాగాలుంటాయి. పరిధీయ నాడీమండలంలో కండరాలు, గాంగ్లియా, నరాలు ఉంటాయి. కొవిడ్ ప్రభావం ఈ అన్ని విభాగాల మీద ఉంటుంది. కరోనా వైరస్ను ఎదుర్కొనే రోగనిరోధక వ్యవస్థ అధికంగా పనిచేయడం వల్ల , శరీరంలోని అవయవాలు ముఖ్యంగా మెదడు మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. దాన్నే వైద్య పరిభాషలో సైటోకిన్ స్టార్మ్ సిండ్రోమ్ అంటారు. దీని వల్ల రక్త నాళాలు మూసుకుపోయి కంటి చూపు మందగించడం, కాళ్లూ, చేతుల పనిచేయకపోడం వంటి సమస్యలు తలెత్తుతాయి. నరాల మీద ఉండే పొరలు దెబ్బతినడం వల్ల, నరాలు చచ్చుబడిపోతాయి. దాని ప్రభావం కాళ్లు, చేతులు, ప్రధాన భాగం మీద అధికంగా ఉంటుంది. దీన్ని గిల్లెన్ బారీ సిండ్రోం అంటారు.
కరోనా నుంచి కోలుకున్నప్పటికీ చాలామందిలో తలనొప్పి, వికారం, చురకుదనం లోపించడం, రుచి, వాసన తెలియకపోవడం, పక్షవాతం, బలహీనత, కండరాల నొప్పులు ఉంటున్నాయి. కరోనా కారణంగా నాడీమండలంపై ప్రభావం అన్నది ప్రధానంగా మధుమేహం, ఊబకాయం, కిడ్నీ జబ్బులు, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతూ వ్యాధినిరోధకత సన్నగిల్లిన వారిలో ఎక్కువగా ఉంటుంది. కరోనా వైరస్ నాడీమండలం మీద ప్రభావం చూపిస్తే వాసన కోల్పోవడం, సైటోకిన్ స్టార్మ్ అంటే తన రోగ నిరోధక వ్యవస్థే తన శరీరం మీద ప్రభావం చూపడం, ఆక్సిజన్ తగ్గడం వల్ల మెదడు కణజాలం దెబ్బతినడం జరుగుతుంది. అలాగే నాడీ వ్యవస్థలోని అన్ని భాగాలు దెబ్బతింటున్నట్లు అనేక అధ్యయనాల్లో వెల్లడైంది.
కరోనా కారణంగా నాడీమండలం ప్రభావితమైనప్పుడు చాలా మందిలో అయోమయం కనిపిస్తోంది. తీవ్రమైన కుంగుబాటుకు భావోద్వేగాలకు లోనవుతున్నారు. ఒళ్లంతా వణుకు, దేహంపై అదుపుతప్పడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. కొంతమందిలో ఆహారం మింగడంలో ఇబ్బందులు ఎదురవుతాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే కండరాలు తీవ్రంగా దెబ్బతినడం, చచ్చుబడిపోవడం వంటి అనర్థాలు కూడా తలెత్తవచ్చు. మూత్రం తక్కువగా, చిక్కగా రావడం, నరాల బలహీనత, మూత్ర పిండాలు దెబ్బతినడం వంటి సమస్యలు అరుదుగా కనిపించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొవిడ్ వల్ల కాని, మరేదైనా కారణం వల్ల కానీ ఈ లక్షణాలు కనిపించినప్పుడు అధునాతన స్కానింగ్ పరీక్షలు అవసరం అవుతాయి. అయితే కరోనా ప్రభావం వల్ల నరాల ఇబ్బందులు వచ్చిన వాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటున్నారు వైద్యులు. సరైన వైద్యం తీసుకోవడం వల్ల సమస్యలనుంచి బయట పడవచ్చని చెబుతున్నారు. జ్ఞాపకశక్తి తగ్గడం, మాట తడబటం వంటి లక్షణాలు కరోనా లక్షణాలకు ముందే కనిపిస్తున్నాయి. అందువల్ల ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.