Mission Prarambh: నింగిలోకి దూసుకెళ్లిన తొలి ప్రైవేట్‌ రాకెట్‌.. ప్రయోగం సక్సెస్‌

భారత అంతరిక్షయాన రంగంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలో తొలి ప్రైవేటు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) ఈ ప్రయోగానికి వేదికైంది.

Updated : 18 Nov 2022 12:02 IST

శ్రీహరికోట: భారత అంతరిక్షయాన రంగంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలో తొలి ప్రైవేటు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) ఈ ప్రయోగానికి వేదికైంది. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు షార్‌లోని సౌండింగ్‌ రాకెట్‌ కాంప్లెక్స్‌ నుంచి తొలి ప్రైవేటు రాకెట్‌ ‘విక్రమ్‌-ఎస్‌’ నింగిలోకి వెళ్లింది. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు.

హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ.. విక్రమ్‌-సబ్‌ ఆర్బిటల్‌ (వీకేఎస్‌) ఈ ప్రైవేట్‌ రాకెట్‌ను అభివృద్ధి చేసింది. ఈ మొట్టమొదటి మిషన్‌కు ‘ప్రారంభ్‌’ అని నామకరణం చేశారు. ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ హాజరయ్యారు. వాస్తవానికి ఈనెల 12నే ప్రయోగం చేపట్టాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో నేటికి వాయిదా పడింది. విక్రమ్‌-ఎస్‌ రాకెట్‌.. సింగిల్‌ స్టేజ్‌ సబ్‌-ఆర్బిటల్‌ లాంచ్‌ వెహికల్‌ కావడం ప్రత్యేకత. ఈ రాకెట్‌ మూడు పేలోడ్‌లను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది.

విక్రమ్‌ సారాభాయ్‌కి నివాళిగా..

అంతరిక్ష రంగంలో అడుగుపెట్టేందుకు ప్రైవేటు రంగానికి మన దేశంలో రెండేళ్ల క్రితమే అనుమతి లభించింది. అప్పటి నుంచి స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ఈ రాకెట్‌ అభివృద్ధి పనుల్లో నిమగ్నమైంది. చాలా తక్కువ ఖర్చుతో, రెండేళ్లలోనే ఈ రాకెట్‌ను తయారుచేసినట్లు సంస్థ సీఈఓ పవన్‌ కుమార్‌ గతంలో వెల్లడించారు. మన దేశంలో అంతరిక్ష ప్రయోగాలకు అంకురార్పణ చేసిన ప్రముఖ శాస్త్రవేత్త విక్రమ్‌ సారాభాయ్‌కి నివాళిగా తమ రాకెట్‌కు ‘విక్రమ్‌-ఎస్‌’ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. ఈ రాకెట్‌ ప్రయోగం కోసం స్కైరూట్‌.. ఇటీవల  51 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.408 కోట్లు) పెట్టుబడిని సమీకరించింది. మింత్రా వ్యవస్థాపకుడు ముఖేశ్ బన్సల్‌, గూగుల్‌ బోర్డు సభ్యుడు శ్రీరామ్‌.. ఈ సంస్థకు పెట్టుబడులు సమకూర్చిన వారిలో ఉన్నారు.

విద్యార్థులు రూపొందించిన పేలోడ్‌..

విక్రమ్‌-ఎస్‌ రాకెట్‌ అంతరిక్షంలోకి తీసుకెళ్లే పేలోడ్‌లలో ఒకటి విదేశీ సంస్థకు చెందినది కాగా.. రెండు మన దేశ సంస్థలకు చెందినవి. ఇందులో ఒకటి చెన్నై కేంద్రంగా నడుస్తున్న స్పేస్‌కిడ్జ్‌ ఆధ్వర్యంలో రూపొందించిన 2.5 కిలోల ‘ఫన్‌-శాట్‌’ పేలోడ్‌. దీనిని మన దేశంతో పాటు, అమెరికా, సింగపూర్‌, ఇండోనేసియా విద్యార్థులు రూపొందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని