భూముల విలువ పెంపునకు రంగం సిద్ధం

 తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలతో పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా అందే అన్ని సేవల ఛార్జీలు పెంపునకు రంగం సిద్ధమైంది. కార్యాలయాల్లో అందుబాటులో

Updated : 13 Jul 2021 19:57 IST

సవరించిన ధరలు నేటి రాత్రి నుంచే అమల్లోకి?

హైదరాబాద్‌:  తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలతో పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా అందే అన్ని సేవల ఛార్జీలు పెంపునకు రంగం సిద్ధమైంది. ఇవాళ సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఇదే అంశంపై చర్చిస్తోంది. ఈ నేపథ్యంలో.. కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారుల నుంచి సబ్‌ రిజిస్ట్రార్లకు ఆదేశాలు అందాయి. కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే.. ఈ రాత్రి నుంచే సవరించిన ధరలు అమల్లోకి వచ్చే అవకాశముంది. భూములు, ఆస్తుల విలువ పెంపునకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను కూడా అధికారులు సిద్ధం చేశారు.

వ్యవసాయేతర భూముల విలువను ఇప్పటి కన్నా గరిష్ఠంగా 50 శాతం పెంచాలని రిజిస్ట్రేషన్‌ శాఖ ప్రతిపాదనలు సిద్ధంచేసింది. ఈ క్రమంలో సాగుభూములు గరిష్ఠ, కనిష్ఠ విలువల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. భూముల మార్కెట్‌ విలువ పెంపుతో పాటు, రిజిస్ట్రేషన్‌, తత్సంబంధిత 20 రకాల సేవలపై విధించే ఛార్జీలను పెంచనున్నారు. తెలంగాణలో వ్యవసాయేతర భూములు, ఇతర ఆస్తుల విలువ గరిష్ఠంగా 50 శాతం పెరగనుండగా.. ప్రాంతాల వారీ విలువ ఆధారంగా అవి 20 శాతం, 30 శాతం, 40 శాతం మేర పెరగనున్నాయి. ఎనిమిదేళ్ల తర్వాత భూముల విలువ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను పెంచాలని నిర్ణయించిన నేపథ్యంలో తదనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. 2020 జనవరిలో స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖ సిద్ధం చేసిన నివేదికలోని అంశాలతో పాటు ఏడాదిన్నర వ్యవధిలో చోటుచేసుకున్న పరిణామాలను ప్రాతిపదికగా చేసుకుని భూముల విలువను నిర్ధారించినట్టు సమాచారం. గతంలో ప్రతిపాదనలు రూపొందించినపుడు ప్రాంతీయ రింగ్‌రోడ్డు మాట లేదు. తాజాగా అది తెరపైకి వచ్చిన క్రమంలో దానికి చేరువలో భూముల మార్కెట్‌ విలువ భారీగా పెరగటాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. సవరించిన ధరలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

పెంపు ఇందుకే..

 ఎనిమిదేళ్లుగా భూముల విలువను సవరించలేదు. ఈ కాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్‌డీపీ), తలసరి ఆదాయం రెట్టింపయ్యాయి.

నూతన ప్రాజెక్టులతో కొత్త ఆయకట్టు అభివృద్ధి చెందింది. సాగునీటి వసతి విస్తరించడంతో భూముల విలువ భారీగా పెరిగింది.

రాష్ట్రంలో ఐటీ, ఔషధ, పర్యాటకం, స్థిరాస్తి రంగాల్లో పెరుగుదల, కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రతిపాదిత ప్రాంతీయ రింగ్‌రోడ్డు వివిధ రంగాల్లో అభివృద్ధి నేపథ్యంలో భూముల మార్కెట్‌ విలువలు సవరించాలి.

గతంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన సెంట్రల్‌ వాల్యుయేషన్‌ సలహా కమిటీ భూముల విలువను సవరించాలని ప్రతిపాదించింది.

ఏమేం పెరగనున్నాయ్‌..

భూములు, ఇళ్లు, ఫ్లాట్లు, ప్లాట్ల క్రయవిక్రయాలపై ప్రస్తుతం స్టాంపు డ్యూటీ 4శాతం ఉండగా ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ 1.5, రిజిస్ట్రేషన్‌ ఫీజు 0.5 శాతంగా ఉంది. మొత్తం 6శాతం రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను చెల్లిస్తున్నారు. ఇకపై పెరగనున్నవి.

భూముల విలువ 

రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు

విక్రయ అగ్రిమెంట్‌/జీపీఏ

డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌, జీపీఏ

డెవలప్‌మెంట్‌ కన్‌స్ట్రక్షన్‌ అగ్రిమెంట్‌

కుటుంబీకుల భాగపక్షాల రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు

కుటుంబ, కుటుంబేతరుల మధ్య ఒప్పందాలు

బహుమతి(గిఫ్ట్‌)

టైటిల్‌ డీడ్‌ డిపాజిట్‌

జీపీఏ (ఆథరైజేషన్‌తో, ఆథరైజేషన్‌ లేకుండా) 

వీలునామా 

లీజు సహా ఇతర సేవల ఛార్జీలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని