సాగునీటిపై వ్యయంలో అగ్రభాగాన తెలంగాణ
కొవిడ్ నేపథ్యంలో రాష్ట్రాల రాబడుల్లో మొదటి, రెండు త్రైమాసికాల్లో భారీగా కోత పడింది. గత ఆర్థిక సంవత్సరం
2015-21 రాష్ట్రాల బడ్జెట్లపై పీఆర్ఎస్ విశ్లేషణ
కొవిడ్ నేపథ్యంలో రాష్ట్రాల రాబడుల్లో మొదటి, రెండు త్రైమాసికాల్లో భారీగా కోత పడింది. గత ఆర్థిక సంవత్సరం కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13 శాతం దాకా రాబడులు తగ్గాయి. కిందటేడాది ఏప్రిల్ నుంచి అక్టోబరు దాకా రాష్ట్రాల రాబడుల అంచనాల్లో 52 శాతం దాకా వసూలు కాగా ఈ సంవత్సరంలో ఆ కాలానికి 37 శాతమే వచ్చింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటా తగ్గింది. కొవిడ్ నేపథ్యంలో రాష్ట్రాలు వ్యయంలో కోత విధించుకోవాల్సి వచ్చింది. ఏప్రిల్ నుంచి అక్టోబరు దాకా 21 రాష్ట్రాలు 3.2 శాతాన్ని తగ్గించుకున్నాయి. పెట్టుబడి వ్యయంలో 25.3 శాతం తగ్గింది. తెలంగాణకు గత ఏడాదికంటే పదిశాతం మేర కేంద్రపన్నుల వాటా తగ్గింది. ఆంధ్రప్రదేశ్కు రెండుశాతం ఎక్కువ నిధులు వచ్చాయి. సాగునీటి రంగంపై వ్యయంలో తెలంగాణ దేశంలోనే ముందుండగా సంక్షేమ రంగ వ్యయంలో ఆంధ్రప్రదేశ్ ముందుంది. 2015-19 మధ్య బడ్జెట్ అంచనాల కంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్ భారీగా తగ్గింది. తెలంగాణ రాష్ట్రానికి అత్యధికంగా అంచనాల కంటే 58 శాతం తగ్గాయి. రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై దిల్లీకి చెందిన పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ తాజాగా నివేదికను విడుదల చేసింది. 2015 నుంచి 2019 ఆర్థిక సంవత్సరాల వరకు రాష్ట్ర ప్రభుత్వాల వ్యయాలను; 2015 నుంచి 2021 వరకు బడ్జెట్ కేటాయింపులను విశ్లేషించింది.
వ్యయాలు ఇలా...
రాష్ట్రాలు 76 శాతం రెవెన్యూ రాబడుల నుంచి వ్యయం చేస్తుండగా మిగిలింది రుణాలు తీసుకుని ఖర్చు చేస్తున్నాయి. రాష్ట్రాల్లో రెవెన్యూ వ్యయమే అత్యధికం. ఇది 85 శాతంగా ఉండగా పెట్టుబడి వ్యయం 15 శాతం.
2015-21 మధ్య రాష్ట్రాలు అత్యధిక వ్యయాన్ని విద్యపై వెచ్చించాయి. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, పట్టణాభివృద్ధికి కేటాయింపులు పెరిగాయి.
కేటాయింపులు... వ్యయం మధ్య అంతరం
2015-19 మధ్య కాలంలో రాష్ట్రాల కేటాయింపులు, వ్యయాల మధ్య సగటు అంతరం 8 శాతంగా ఉంది. రాబడుల అంచనాల్లో 9 శాతం మేర తగ్గగా వ్యయంలో 8 శాతం తగ్గింది. రాబడులు తగ్గడంతో వ్యయం కూడా తగ్గింది. తెలంగాణ, గోవా రాష్ట్రంలో కేటాయింపులు, వ్యయాల మధ్య అంతరం 19 శాతంగా.. ఏపీలో 7 శాతంగా ఉంది.
అంచనాల కంటే తగ్గిన పెట్టుబడి వ్యయం
పెట్టుబడి వ్యయం అంచనాల్లో సగటున 14 శాతం కోతపడింది. గోవాలో 50 శాతం, పంజాబ్లో 45 శాతం, అసోంలో 42 శాతం తగ్గుదల ఉంది. తెలంగాణలో 15 శాతం, ఏపీలో 17 శాతం తగ్గింది. గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి, సాగునీరు, గ్రామీణాభివృద్ధి ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమం, తాగునీరు, విద్య విభాగాలకు నిర్దేశించిన కేటాయింపుల్లో వ్యయం కాని మొత్తం దాదాపు పది శాతమే ఉంది.
రెవెన్యూ రాబడుల్లో 23 శాతానికి పైగా అసలుకు, వడ్డీలకు
రాష్ట్రాలు రెవెన్యూ రాబడుల్లో అప్పులు, వడ్డీ చెల్లించడానికి 23.4 శాతం వెచ్చిస్తున్నాయి. ఇందులో అసలుకు 11.3 శాతం కాగా, వడ్డీలకు 12.1 శాతం. పంజాబ్ రెవెన్యూ రాబడుల్లో 84 శాతం అప్పుల అసలు, వడ్డీల చెల్లింపునకు వ్యయం చేస్తోంది. తెలంగాణ వ్యయం 26 శాతం ఉండగా ఆంధ్రప్రదేశ్ వ్యయం 32 శాతంగా ఉంది.
జీఎస్డీపీలో అప్పులు 20 శాతంకంటే ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు 26 ఉండగా తెలంగాణలో 22.8 శాతం.. ఆంధ్రప్రదేశ్లో 32.7 శాతంగా ఉంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమంలో...
ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమంలో రాష్ట్రాల సగటు వ్యయం 2.9 శాతం. ఏపీ 11.3 శాతంతో మొదటి స్థానంలో ఉండగా 6.9 శాతంతో తెలంగాణ రెండో స్థానంలో, 5.4 శాతంతో కర్ణాటక మూడో స్థానంలో ఉన్నాయి.
మానవాభివృద్ధిపై వ్యయంలో...
మానవాభివృద్ధికి సంబంధించిన అంశాలపై రాష్ట్రాలు 24 శాతం పైగా వ్యయం చేస్తున్నాయి. ఈ అంశంలో విద్య, వైద్యం, ఆరోగ్యం, తాగునీరు, పారిశుద్ధ్యం ఉన్నాయి. దిల్లీ అత్యధికంగా 42 శాతం వ్యయం చేస్తోంది. తర్వాత స్థానాల్లో అసోం (31 శాతం), మేఘాలయ (30శాతం) ఉన్నాయి. తెలంగాణ వ్యయం 16 శాతం.. ఆంధ్రప్రదేశ్ది 20 శాతంగా ఉంది.
పౌరుల భద్రతకు...
రాష్ట్రాలు ఐదేళ్లలో పౌరుల భద్రతకు సగటున 6 శాతం వ్యయం చేశాయి. ఈశాన్యరాష్ట్రాలు పదిశాతం కంటే ఎక్కువ నిధులు వీటికే వ్యయం చేశాయి. ఈ అంశంలో తెలంగాణ రాష్ట్రం 6 శాతం, ఆంధ్రప్రదేశ్ 5 శాతంగా ఉంది.
సామాజిక భద్రతలో...
ఈ రంగంలో సగటు వ్యయం 4.1 శాతం. అత్యధికంగా పశ్చిమబంగా 9.2 శాతం వ్యయం చేస్తోంది. ఈ రంగంలో 7.8 శాతంతో ఏపీ రెండో స్థానంలో ఉంది. తెలంగాణ 6.9 శాతంతో నాలుగో స్థానంలో ఉంది.
75% తెలంగాణ సొంతరాబడులు
దిల్లీ, హరియాణ, తెలంగాణ, మహారాష్ట్రలు 2015-21 మధ్య 75 శాతంపైగా సొంత రాబడులతోనే ముందుకు వెళ్తున్నాయి. దిల్లీ సొంతరాబడులు 86 శాతంగా ఉండగా హరియాణ, మహారాష్ట్ర 76 శాతం, తెలంగాణ 75 శాతంగా ఉన్నాయి. కేంద్రం నుంచి ఈ రాష్ట్రాలకు అందింది 27 శాతంలోపే. దిల్లీకి 14 శాతం, హరియాణకు 24 శాతం, తెలంగాణకు 25 శాతం, మహారాష్ట్రకు 23 శాతం నిధులు మాత్రం అందాయి. ఆంధ్రప్రదేశ్ సొంత రాబడులు 51 శాతం కాగా కేంద్రం నుంచి అందింది 49 శాతం.
రాష్ట్రాలకు వస్తున్న అత్యధిక రాబడిలో జీఎస్టీ, అమ్మకం పన్ను, ఎక్సైజ్, స్టాంపు డ్యూటీ కీలకంగా ఉన్నాయి. 2015-19 మధ్య బడ్జెట్ అంచనాల కంటే 9 శాతం తక్కువ రాబడులు నమోదయ్యాయి. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి 2019-20 వరకు అయిన వ్యయాల ప్రకారం
కీలక రంగాల్లో మొదటి స్థానాలు ఇలా....
సాగునీటి రంగం తెలంగాణ
ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమం ఏపీ
పట్టణాభివృద్ది గుజరాత్
సామాజిక భద్రత పశ్చిమబెంగాల్
గ్రామీణాభివృద్ధి ఝార్ఖండ్
విద్య, ఆరోగ్యం, మానాభివృద్ధి దిల్లీ
గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి తదితరాల్లో...
వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, విద్యుత్, రోడ్లు, ఆర్థిక సేవల రంగానికి రాష్ట్రాలు 31 శాతం వ్యయం చేస్తున్నాయి. చత్తీస్గఢ్ అత్యధికంగా 44 శాతం వ్యయం చేసింది. మధ్యప్రదేశ్ 39 శాతంతో రెండో స్థానంలో ఉంది. తెెలంగాణ 38 శాతంతో మూడో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ 29 శాతం వ్యయం ఉంది.
సాగునీటి రంగంలో రాష్ట్రాల సగటు వ్యయం 4 శాతం. ఈ రంగంలో అత్యధిక వ్యయంతో తెలంగాణ ముందుంది. 2015-21 వరకు రాష్ట్ర బడ్జెట్లలో 8.4 శాతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ వ్యయం 6.7 శాతంతో నాలుగో స్థానంలో ఉంది. ఒడిశా 7.3 శాతం, కర్ణాటక 7.2 శాతం, గుజరాత్ 6.6 శాతం నిధులు వ్యయం చేశాయి.
పట్టణాభివృద్ధిపై రాష్ట్రాల సగటు వ్యయం 3.1 శాతం. గుజరాత్ అత్యధికంగా వ్యయం చేస్తోంది. బడ్జెట్లలో 6.4 శాతం వెచ్చిస్తోంది. దిల్లీ 5.7 శాతంతో రెండో స్థానంలో ఉండగా హరియాణ 4.8 శాతంతో మూడో స్థానంలో ఉంది. తెలంగాణలో ఇది 3.1 శాతం, ఆంధ్రప్రదేశ్లో 3.2 శాతంగా ఉంది.
గ్రామీణాభివృద్ధి సగటు వ్యయం 5.9 శాతం. ఝార్ఖండ్ అత్యధికంగా 14.5 శాతం వ్యయం చేస్తోంది. తర్వాత స్థానంలో 12.3 శాతంతో బిహార్ ఉండగా పశ్చిమబెంగాల్ 10.4 శాతంతో తర్వాత స్థానంలో ఉంది. తెలంగాణలో ఈ వ్యయం 4.4 శాతం కాగా అంధ్రప్రదేశ్లో 6.5 శాతం. - ఈనాడు, హైదరాబాద్
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!