Hyderabad: డీమ్డ్‌ వర్సిటీలో ర్యాగింగ్‌ ఘటన.. ఏడాదిపాటు 12మంది విద్యార్థులు సస్పెండ్‌

శంకర్‌పల్లి శివారులోని ఇక్ఫాయ్‌ డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్‌ ఘటనపై యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. 12మంది విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేసింది.

Updated : 12 Nov 2022 13:41 IST

హైదరాబాద్: శంకర్‌పల్లి శివారులోని ఇక్ఫాయ్‌ డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్‌ ఘటనపై యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. 12మంది విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేసింది. ఈనెల ఒకటిన ఈ ర్యాగింగ్‌ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయంపై బాధితుడు ఫిర్యాదు చేస్తే.. పోలీసులు రాజీ కుదిర్చి పంపారు. దీనికి సంబంధించి బాధిత విద్యార్థి మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేయడంతో 12 మంది సీనియర్‌ విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వర్సిటీ యాజమాన్యం ఆ 12మంది విద్యార్థులను సస్పెండ్‌ చేసింది. ఈ ఘటనపై ఐబీఎస్‌లో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ దర్యాప్తు అనంతరం మరికొంత మంది విద్యార్థులపై వేటు పడే అవకాశం ఉంది.

శంకర్‌పల్లి శివారులోని ఇక్ఫాయ్‌ డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో హాస్టల్‌ విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. హాస్టల్‌ విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న యువకుడు(18), యువతి(17) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వారి మధ్య దూరపు బంధుత్వం కూడా ఉంది. కొన్ని రోజుల క్రితం వీరిద్దరి మధ్య చిన్నపాటి మనస్పర్థలు వచ్చాయి. విషయాన్ని ఆ యువతి తన బంధువయిన సీనియర్‌ విద్యార్థికి తెలపగా.. అతడు కొందరు స్నేహితులతో కలిసి హాస్టల్‌లో ఉన్న ఆ యువకుడిపై దాడి చేశారు. మరుసటిరోజు బాధిత యువకుడి స్నేహితులు సీనియర్లపై దాడికి పాల్పడ్డారు. సీనియర్ల దాడిలో గాయపడిన ఓ విద్యార్థి హాస్టల్‌లో చికిత్స పొందుతున్నాడు. హాస్టల్లో విద్యార్థులు ఘర్షణ పడిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని