రిపేర్‌ కేఫ్‌‌.. మీ దగ్గరకే వస్తుంది..

ఈ కాలం మనుషుల్లో ఒక వస్తువును పూర్తిగా వాడుకునే ఓపిక లేదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఓ వస్తువు పాడవుతే.. దానికి మరమ్మతులు చేసి వాడుకునే అవకాశమున్నా.. దాన్ని పక్కకు పెట్టేసి కొత్తది కొనుగోలు చేస్తుంటారు. అలా ప్రతి ఒక్కరి ఇంట్లో ఎన్నో వస్తువులు

Published : 25 Oct 2021 01:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ కాలం మనుషుల్లో ఒక వస్తువును పూర్తిగా వాడుకునే ఓపిక లేదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఓ వస్తువు పాడైతే.. దానికి మరమ్మతులు చేసి వాడుకునే అవకాశమున్నా.. పక్కకు పెట్టేసి కొత్తది కొనుగోలు చేస్తుంటారు. అలా ప్రతి ఒక్కరి ఇంట్లో ఎన్నో వస్తువులు మూలకు పడి ఉంటాయి. వాటిని మరమ్మతులు చేయించాలంటే అనేక రిపేర్‌ షాపులకు తిరగాల్సి ఉంటుంది. అందుకే అలాంటి ఇబ్బంది లేకుండా బెంగళూరులో ‘రిపేర్‌ కేఫ్‌’ పేరుతో స్వచ్ఛంద సంస్థ ఏర్పాటైంది. ప్రతి ఆదివారం ఓ ప్రాంతానికి వెళ్లి వర్క్‌షాప్‌ నిర్వహిస్తుంటుంది. అందులో స్థానిక ప్రజల వద్ద ఉండే పాడైన వస్తువులను మరమ్మతులు చేసి ఇస్తోంది. కరోనా ఆంక్షలతో వర్క్‌షాప్‌ నిర్వహించలేని చోట ఆన్‌లైన్‌ క్లాసుల ద్వారా మరమ్మతులు సొంతగా ఎలా చేసుకోవాలో నేర్పిస్తోంది.

పూర్ణ సాకర్‌ అనే యువతి తన స్నేహితులతో కలిసి 2015లో ఈ ‘రీపేర్‌ కేఫ్‌’ను ఏర్పాటు చేసింది. ఇందులో ఇంజినీర్లు, టైలర్లు, మెకానిక్‌లు, స్వర్ణకారులు, ఎలక్ట్రిషియన్లు, ప్లంబర్లు ఇలా అనేక మంది వాలంటీర్లుగా పాల్గొంటుంటారు. దీంతో బైక్‌ నుంచి ఐరన్‌ బాక్స్‌ వరకు అన్ని రకాల మరమ్మతులు చేసేవారు ఈ రీపేర్‌ కేఫ్‌లో అందుబాటులో ఉంటారు. వీరంతా సోషల్‌మీడియా ద్వారా ఆదివారం రోజున ఏ ప్రాంతంలో వర్క్‌షాపు నిర్వహించబోతున్నారో ముందే సమాచారం ఇస్తారు. దీంతో ఆ రోజున అక్కడి ప్రజలు తమ ఇళ్లలో ఉండే పాడైన వస్తువుల్ని తీసుకొచ్చి వారి వద్ద మరమ్మతులు చేయించుకోవచ్చు. అయితే, ఇందుకోసం నామమాత్రం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

లాక్‌డౌన్‌తో ఆన్‌లైన్‌ బాట..!

అన్ని రకాల సేవలు ఒక్క చోటనే ఉండటంతో బెంగళూరు ప్రజల నుంచి ఈ రిపేర్‌ కేఫ్‌కు మంది ఆదరణ లభించింది. కానీ, కరోనా.. లాక్‌డౌన్‌ వల్ల మునపటిలా వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేయడం సాధ్యపడట్లేదు. ఆంక్షలు సడలించినప్పుడో.. వీలు కుదిరినప్పుడో అడపాదడపా వర్క్‌షాప్‌ నిర్వహించగలుగుతున్నారు. దీంతోపాటు ఆన్‌లైన్‌ ద్వారా సేవలు కొసాగించాలని రిపేర్ కేఫ్‌ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి ఆదివారం పిల్లలు, పెద్దల కోసం రెండు రకాల ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తోంది. వీటి ద్వారా బొమ్మలు, చిన్న వస్తువులకు సొంతగా మరమ్మతు ఎలా చేయాలో చిన్నారులకు నేర్పిస్తున్నారు. కంప్యూటర్‌, బైకు వంటి వాటికి వీలైనంత వరకు సొంతగా మరమ్మతులు చేసుకునేలా పెద్దలకు శిక్షణ ఇస్తున్నారు. ముఖ్యంగా పిల్లల్లో కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆరాటం ఎక్కువగా ఉంటుంది. అందుకే చిన్నారులు ఆన్‌లైన్‌ క్లాసుల్లో చురుగ్గా పాల్గొంటున్నారట. పిల్లలతోపాటు పెద్దలూ ఈ ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరవుతూ రిపేర్‌ కేఫ్‌ సేవలను వినియోగించుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని