HYD: ఎంఎంటీఎస్‌ తిరిగేదెప్పుడు..?

భాగ్యనగరవాసులను కరోనా కష్టాలు ఇంకా వీడటం లేదు. లాక్‌డౌన్‌తో ఆగిపోయిన ఎంఎంటీఎస్‌ రైళ్లు ఏడాదిన్నర గడిచినా పట్టాలెక్కలేదు. దీంతో చిరువ్యాపారులు, ఉద్యోగులు, కూలీలకు అవస్థలు తప్పడం లేదు....

Published : 14 Jun 2021 19:47 IST

పునఃప్రారంభించాలని ప్రయాణికుల వేడుకోలు

    

హైదరాబాద్‌: భాగ్యనగరవాసులను కరోనా కష్టాలు ఇంకా వీడటం లేదు. లాక్‌డౌన్‌తో ఆగిపోయిన ఎంఎంటీఎస్‌ రైళ్లు ఏడాదిన్నర గడిచినా పట్టాలెక్కలేదు. దీంతో చిరువ్యాపారులు, ఉద్యోగులు, కూలీలకు అవస్థలు తప్పడం లేదు. 5, 10 రూపాయలకే దర్జాగా ప్రయాణించేవారు.. ఇప్పుడు రోజుకు దాదాపు రూ.100 రవాణాకు ఖర్చు చేయాల్సి వస్తోంది. మెట్రో, ఆర్టీసీ నడుస్తున్నప్పుడు ఎంఎంటీఎస్‌ ఎందుకు  నడపడం లేదంటూ నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

హైదరాబాద్‌ మహానగర ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులతో మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టం (ఎంఎంటీఎస్‌) అందుబాటులోకి వచ్చింది. ఈ రైళ్ల రాకతో.. ఎక్కువ దూరాన్ని తక్కువ ఖర్చుతో ప్రయాణించే వెసులుబాటు కలిగింది. కేవలం 5, 10, 15 రూపాలయలతో చిరువ్యాపారులు, ఉద్యోగులతోపాటు అనేకమంది ఈ రైళ్ల సేవలను వినియోగించుకునేవారు. 2003 ఆగస్టులో ప్రారంభమైన ఎంఎంటీఎస్‌ రైళ్లు గతేడాది మార్చి 23 వరకు నిరంతరాయంగా సేవలందించాయి. అలాంటిది కరోనా దెబ్బకు 18 నెలలుగా షెడ్డుకే పరిమితమయ్యాయి. అరకొర జీతాలు, ఆదాయంతో బతుకుబండిని నడిపేవారికి ఎంఎంటీఎస్‌ నడవకపోవడం ఆర్థిక భారాన్ని మోపుతోంది. పెట్రో ఖర్చులు విపరీతంగా పెరగడంతో సొంత వాహనాల్లో వెళ్లడమూ ఇబ్బందిగా మారింది. తమ సగం జీతం రవాణా ఖర్చులకే పోతోందంటూ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎంఎంటీఎస్‌ రైళ్లు సికింద్రాబాద్‌-లింగంపల్లి, హైదరాబాద్‌-లింగంపల్లి మధ్య 29 కిలోమీటర్ల మేర 2003 నుంచి నిరంతరం సేవలందిస్తున్నాయి. 15 కిలోమీటర్ల సికింద్రాబాద్‌-ఫలక్‌నుమా సెక్షన్‌ 2014 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. జంట నగరాల్లో మొత్తం 26 స్టేషన్లలో ఎంఎంటీఎస్‌ సేవలందిస్తోంది. ప్రాంరంభంలో 48 సర్వీసులు, 6 కోచ్‌లు.. 13 వేల మంది ప్రయాణికులతో ప్రారంభమైన సర్వీసులు ప్రస్తుతం 121 సర్వీసులతో 1.65 లక్షల ప్రయాణికుల స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఎంఎంటీఎస్‌ రైళ్లు నడవకపోవడంతో నగరవాసులకు ప్రయాణం భారంగా మారుతోంది. ఆర్టీసీ, క్యాబ్‌లు, ఆటోలు, మెట్రో నడుపుతున్నప్పుడు ఎంఎంటీఎస్‌ మాత్రం ఎందుకు నడపడం లేదని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. చిరుద్యోగులు, వ్యాపారులను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా ప్రభుత్వం ఎంఎంటీఎస్‌ రైళ్ల పునఃప్రారంభంపై దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని