SC Railway: విజయవాడ రైల్వే స్టేషన్‌లో అందుబాటులోకి అత్యాధునిక రోబోటిక్‌ మసాజ్‌ ఛైర్లు!

ప్రయాణికులకు మెరుగైన సేవలు అదించడంతోపాటు, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతి కోసం దక్షిణమధ్య రైల్వే విజయవాడ రైల్వేస్టేషన్‌లో రోబోటిక్‌ మసాజ్‌ సేవలను ప్రారంభించింది. 

Published : 10 Jan 2023 01:22 IST

విజయవాడ: ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ రైల్వే స్టేషన్‌లో దక్షిణమధ్య రైల్వే రోబోటిక్‌ మసాజ్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రోబోటిక్‌ మసాజ్‌ సెంటర్‌ను దక్షిణమధ్య రైల్వే డివిజినల్‌ మేనేజర్‌ శివేంద్ర మోహన్‌ సోమవారం ప్రారంభించారు. దీని ద్వారా ప్రయాణికులు బాడీ, ఫుట్‌ మసాజ్‌ సేవలను పొందవచ్చు. విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఒకటో నంబర్‌ ఫ్లాట్‌ఫామ్‌పై 84 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ మసాజ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో రెండు రోబోటిక్‌ బాడీ మసాజ్‌ కుర్చీలు, ఒక ఫుట్‌ మసాజ్‌ కుర్చీ ప్రయాణికులకు అందుబాటులో ఉంచారు. 

టికెట్‌యేతర ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగా ఈ మసాజ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు ఐఆర్‌టీఎస్‌ సీనియర్ డీసీఎమ్‌ వి. రాంబాబు తెలిపారు. రోజులో ఎంతో మంది ప్రయాణికులు రైళ్ల కోసం ఫ్లాట్‌ఫామ్‌పైవేచి చూస్తుంటారు. ఆ సమయంలో ప్రయాణికులు బాడీ మసాజ్‌కు ₹ 60, ఫుట్‌ మసాజ్‌కు ₹ 30 రుసుం చెల్లించి రోబోటిక్‌ మసాజ్‌ సేవలను ఉపయోగించుకోవచ్చుని తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సేవలతోపాటు, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందిచడం కోసం విజయవాడ రైల్వే డిజిజన్‌ నిరంతరం కృషి చేస్తోందని రాంబాబు తెలిపారు. ఇటీవలే స్టేషన్‌లో ఫిష్‌ స్పా, హ్యాండ్‌లూమ్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌, మొబైల్‌ యాక్ససరీలకు సంబంధించిన అవుట్‌లెట్లను ప్రారంభించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలోడీసీఎమ్‌ పి. కిరణ్‌ కుమార్‌, ఏసీఎమ్‌ పీ.బీ.ఎన్‌ ప్రసాద్‌ (ఏసీఎమ్‌), ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని