Corona.. అజాగ్రత్త వెనుక అపాయం!

కొంత నిర్లక్ష్యం, మరికొంత అవగాహన లోపం.. కొవిడ్‌ రోగుల్లో తీవ్రతకు కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు. అశాస్త్రీయ విధానాలు పాటిస్తూ ప్రాణాల

Updated : 01 May 2021 08:44 IST

లక్షణాలున్నా టీకా కోసం పరుగులు
సొంత నిర్ణయాలు వద్దంటున్న వైద్యనిపుణులు
ఈనాడు, హైదరాబాద్‌

కొంత నిర్లక్ష్యం, మరికొంత అవగాహన లోపం.. కొవిడ్‌ రోగుల్లో తీవ్రతకు కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు. అశాస్త్రీయ విధానాలు పాటిస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్నేహితులు, సహచరులకు కొవిడ్‌ సోకినట్టు నిర్ధారణ కాగానే కొందరు టీకా కోసం పరుగులు తీస్తున్నారు. అప్పటికే వారిలో కొంతమంది వైరస్‌ బారినపడినా లక్షణాలు కనిపించకపోవడంతో ఇటువంటి తప్పిదాలు చేస్తున్నారని వైద్యులు విశ్లేషిస్తున్నారు. అనంతరం లక్షణాలు కనిపించినా.. టీకా ప్రభావమనే భ్రమలో గడిపేస్తున్నారు. వాస్తవానికి టీకా తీసుకున్నాక కొద్దిమందిలో జ్వరం, ఒళ్లునొప్పులు ఒకటి రెండ్రోజులు మాత్రమే ఉంటాయని డా.శ్రీనివాస్‌ తెలిపారు. టీకా తీసుకున్నాక, కొవిడ్‌ లక్షణాలను ఒకే గాటిన కట్టేసి.. అయోమయంలో ఉండటం కొన్నికేసుల్లో మరణాలకు దారితీసిందని నగరానికి చెందిన ప్రముఖ పల్మనాజిస్టు ఒకరు తెలిపారు. ఇంటి వైద్యంతో కాలయాపన చేయొద్దని నిమ్స్‌ ఆసుపత్రిలోని ప్రముఖ మూత్రపిండ వైద్యనిపుణులు డా.శ్రీభూషణ్‌రాజు సూచించారు. పూర్తిగా కోలుకున్నా.. నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా టీకా వేయించుకోవాలని స్పష్టంచేశారు.
నార్సింగికి చెందిన ఓ భవన నిర్మాణ ఉద్యోగికి.. తాను పనిచేసేచోట కూలీలకు కొవిడ్‌ సోకినట్లు తెలిసింది. అప్పటికే కాస్త జ్వరంగా ఉండటంతో.. మాత్రలు వేసుకున్నారు. మరుసటి రోజు కొవిడ్‌ టీకా వేయించుకున్నారు. తెల్లవారి ఒళ్లునొప్పులు, జ్వరం పెరిగింది. టీకా కారణమంటూ భావించి విధుల్లోకి వెళ్లారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి.. మృతి చెందారు. వైరస్‌ను సకాలంలో గుర్తించకపోవడం, సొంత నిర్ణయంతో ఆలస్యం చేయడమే కారణమంటూ మృతుడి స్నేహితులు తెలిపారు.

కూకట్‌పల్లి నిజాంపేటకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి వయసు 51. టీకా తీసుకున్నారు. ఒంట్లో నలతగా అనిపిస్తే సాధారణ సమస్యగా అంచనా వేసుకున్నారు! కొవిడ్‌ సోకినట్టుగా నిర్ధారించటంలో ఆలస్యమైంది. దీంతో మూడు రోజులు హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు. 7-8 రోజుల తరువాత తీవ్రత పెరగడంతో.. ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందారు. టీకా తీసుకునే కేంద్రం వద్ద గుంపుగా చేరటం, ఎడం పాటించకపోవడంతో వైరస్‌ సోకినట్లు బాధితుడు తెలిపారు.

ఆ రెండుచోట్ల జరభద్రం..

పాతబస్తీ పరిధిలోని ఇద్దరు యువకులు హోటల్‌లో పనిచేస్తారు. కొవిడ్‌ సోకిందనే అనుమానంతో వారంలో రెండుసార్లు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దకెళ్లి పరీక్షలకు నిలబడ్డారు. మూడు వారాల తర్వాత ఇద్దరికీ పాజిటివ్‌గా తేలింది. కేవలం అనుమానం నివృత్తి చేసుకోవాలనే ఉద్దేశంతో పరీక్ష కేంద్రాలకు వస్తూ.. ఇలా కొందరు వైరస్‌ బారినపడుతున్న మాట నిజమేనంటూ ప్రభుత్వ వైద్యుడొకరు తన అనుభవాన్ని వివరించారు. టీకా కోసం వచ్చినపుడు గుంపులుగా చేరడం, మాస్క్‌ ధరించినా వాటిని కేవలం మూతి వరకే ఉంచుకోవడం, ఊపిరి ఆడటం లేదనే ముక్కును కప్పేయకపోవటం, చిరిగిన మాస్క్‌లు తదితర తప్పిదాలతో.. మహమ్మారిని చేతులారా ఆహ్వానించినట్టే అవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు