Telangana news: రెండు లక్షల మంది పూర్వ విద్యార్థులతో సేవా కార్యక్రమాలే లక్ష్యం!

శ్రీ సరస్వతీ విద్యాపీఠం స్వర్ణ జయంతి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని శారదాధామంలో పూర్వ విద్యార్థి పరిషత్ రాష్ట్రస్థాయి మహాసమ్మేళనం ఘనంగా జరిగింది.

Published : 29 Jan 2023 19:36 IST

హైదరాబాద్‌: రెండు లక్షల మందికి పైగా ఉన్న సరస్వతీ శిశుమందిరాల పూర్వ విద్యార్థుల్ని సామాజిక సేవలో భాగస్వాముల్ని చేసేలా క్రియాశీలకంగా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర అధ్యక్షులు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డాక్టర్ చామర్తి ఉమామహేశ్వర్‌రావు వెల్లడించారు. ప్రస్తుతం సమాజం ఉన్న పరిస్థితుల్లో తమ విద్యార్థులను మంచి మార్పుని సృష్టించే సంఘటనా శక్తిగా కార్యోన్ముఖం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. శ్రీ సరస్వతీ విద్యాపీఠం స్వర్ణ జయంతి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌ బండ్లగూడలోని శారదాధామంలో పూర్వ విద్యార్థి పరిషత్ రాష్ట్రస్థాయి మహాసమ్మేళనం జరిగింది. ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ సమ్మేళనానికి మణిపాల్‌ యూనివర్సిటీ ఛాన్సలర్‌, శ్రీ సరస్వతీ విద్యాపీఠం ప్రాంత అధ్యక్షులు ప్రొఫెసర్‌ తిరుమలరావు, ఏబీవీపీ పూర్వ జాతీయ నాయకులు పేరాల శేఖర్‌రావు ఆత్మీయ అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సమ్మేళనానికి  తెలంగాణ నలుమూలల నుంచి వేలాదిగా పూర్వ విద్యార్థులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చామర్తి ఉమామహేశ్వర్‌రావు మాట్లాడుతూ.. బలహీనపడుతోన్న సాంస్కృతిక సంపదను తిరిగి పటిష్టం చేసుకునేలా సరస్వతీ శిశుమందిరాల పూర్వ విద్యార్థులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నేటి విద్యార్థుల్లో జాతీయ దృష్టికోణం మెరుగుపడాలని ఆయన ఆకాంక్షించారు. ఏ స్థాయికి ఎదిగినా మన మూలాలను మరిచిపోరాదన్నారు. 

సినిమాలు, సీరియళ్లు మహిళల్ని విలన్లుగా చూపిస్తున్నాయ్‌: లింగం సుధాకర్‌ రెడ్డి

సరస్వతీ శిశుమందిరాల పూర్వ విద్యార్థులు జాతి నిర్మాణంలో పాలు పంచుకోవాల్సిన ఆవశ్యకతను విద్యాభారతి దక్షిణమధ్య క్షేత్ర సంఘటనా మంత్రి లింగం సుధాకర్‌రెడ్డి వివరించారు. ఈ పూర్వ విద్యార్థులు ప్రస్తుతం దాదాపు అన్ని రంగాల్లోనూ ప్రముఖ స్థానాల్లో ఉన్నారన్నారు. శిశుమందిరాల్లో సంస్కారంతో కూడిన విద్యను అందిస్తున్నామని, ఆ సంస్కారమే జాతీయ భావనకు పునాది అని చెప్పారు. ఒకప్పుడు రామాయణ, భాగవతాల వంటి పురాణాల్లో మాతృమూర్తుల గొప్పతనం గురించి నేర్చుకున్నామని.. కానీ, నేటి సీరియళ్లు, సినిమాల్లో మహిళలను విలన్లుగా చూపిస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఏ స్కూల్లో ఎక్కువ ఫీజు కడితే పిల్లలకు అంత బాగా చదువు వస్తుందన్న భ్రమలో పడిపోయిన తల్లిదండ్రులు.. పిల్లల పెంపకంలో తమవంతుగా ఏం చేయాలన్న బాధ్యతను మరిచిపోతున్నారన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి ఇప్పటివరకు విద్యారంగం బాగా నష్టపోయిందని, ఇకనైనా విద్యావిధానాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరాన్ని సుధాకర్‌ రెడ్డి గుర్తు చేశారు. శిశుమందిరాల అభివృద్ధిని సహించలేని కొందరు ఇక్కడి బోధన గురించి విషప్రచారం చేస్తున్నారని, అలాంటి ప్రయత్నాల్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత పూర్వ విద్యార్థులపై ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వచ్చే రెండేళ్లలో దేశం అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కోబోతుందని, జాతీయవాద శక్తులను ఏకం చేసి మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైనా ఉందని పిలుపునిచ్చారు. 

ఈ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు డీసీపీ రావుల గిరిధర్‌, కో ఆపరేటివ్‌ ట్రైబ్యునల్‌ సభ్యురాలు కిరణ్మయి తదితరులను వేదికపై ఘనంగా సన్మానించారు. విద్యార్థి పరిషత్ పూర్వ ప్రధాన కార్యదర్శి బొడ్డు శ్రీనివాస్‌ పరిషత్‌ వార్షిక నివేదికను చదివి వినిపించారు. పూర్వ విద్యార్థులు తాము చదివిన పాఠశాలలను అన్ని వనరులతో ఆధునీకీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన పూర్వ విద్యార్థులతో శారదా ధామం సందడిగా మారింది.

ఈ కార్యక్రమంలో విద్యాభారతి ప్రాంత సంఘటనా మంత్రి పతకమూరి శ్రీనివాసరావు, క్షేత్ర సేవా ప్రముఖ్‌ కుందూరు విద్వాన్‌రెడ్డి, క్షేత్ర ప్రశిక్షణా ప్రముఖ్‌ రావుల సూర్యనారాయణ, విద్యాభారతి ఉచ్ఛశిక్షా సంస్థాన్‌ అఖిలభారత అధ్యక్షుడు మురళీమనోహర్‌, పూర్వ విద్యార్థి పరిషత్‌ అధ్యక్షుడు హరిస్మరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  ఈ సమ్మేళనంలో శిశుమందిర్‌ విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి నృత్యాలు, గీతాలు అందరినీ అలరించాయి. ఈ సమ్మేళనంలో భాగంగా మధ్యాహ్నం జరిగిన సదస్సులో భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని