
TTD : త్వరలో ఆఫ్లైన్లో సర్వదర్శనం టోకెన్లు : వై.వి.సుబ్బారెడ్డి
తిరుమల : సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా త్వరలోనే ఆఫ్లైన్ ద్వారా సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రక్రియను ప్రారంభిస్తామని తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు.కోవిడ్ కారణంగా ఉద్యోగులు, భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో ఆన్లైన్ ద్వారా సర్వదర్శన టోకెన్లు ఇస్తున్నట్లు చెప్పారు.కోవిడ్ ఆందోళనలతో తిరుపతిలో ఆఫ్ లైన్ ద్వారా టోకెన్లు జారీ విధానాన్ని గత ఏడాది సెప్టెంబరు 25వ తేదీ నుంచి రద్దు చేశామని సుబ్బారెడ్డి వివరించారు.
ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నప్పటికీ అవి గ్రామీణ ప్రాంతాల్లోని భక్తులకు అందడం లేదన్న భావన తితిదేకి ఉందని సుబ్బారెడ్డి అన్నారు. సామాన్య భక్తులకు సౌకర్యవంతంగా వుండేలా తిరుపతిలో ఆఫ్లైన్ ద్వారా సర్వదర్శన టోకెన్లు జారీ చేయాలని అనేక సార్లు భావించినా.. కోవిడ్ తీవ్రత కారణంగా వాయిదా వేయక తప్పడం లేదని చెప్పారు. ఫిబ్రవరి 15వ తేదీ నాటికి ఒమిక్రాన్ తీవ్రత తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో అప్పటివరకు సర్వదర్శనం టోకెన్లను ఆన్లైన్లోనే జారీ చేయనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 15 తర్వాత కోవిడ్ వ్యాప్తి పరిస్థితిని అంచనా వేసి సామాన్య భక్తులకు సులభతరంగా అందేలా ఆఫ్ లైన్ విధానంలో జారీ చేసే అంశం పై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.