గూగుల్‌ డూడుల్‌పై ‘భారత శాటిలైట్‌ మ్యాన్‌’!

ప్రముఖ ఆన్‌లైన్‌ దిగ్గజం గూగుల్‌ తన సెర్చింజన్‌పై ప్రత్యేక సందర్భాలు, ప్రముఖుల జయంతి రోజున డూడుల్‌ను ఆవిష్కరించే విషయం తెలిసిందే. అందులో భాగంగా భారత శాటిలైట్‌ మ్యాన్‌గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ

Updated : 11 Mar 2021 13:59 IST

దిల్లీ: ప్రముఖ ఆన్‌లైన్‌ దిగ్గజం గూగుల్‌ తన సెర్చింజన్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక సందర్భాలు, ప్రముఖుల జయంతి రోజున వారి గౌరవార్థం డూడుల్‌ను ఆవిష్కరిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా నేడు భారత శాటిలైట్‌ మ్యాన్‌గా ప్రసిద్ధి చెందిన.. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త ఉడుపి రామచంద్రరావుకు అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. నేడు ఆయన 89వ జయంతిని పురస్కరించుకుని గూగుల్‌ సెర్చింజన్‌ ప్రత్యేక డూడుల్‌ను ఆవిష్కరించింది. రావు చిత్రంతో కూడిన డూడుల్‌ను సెర్చింజన్‌పై పోస్ట్‌ చేస్తూ.. ఆయనకు ఘన నివాళి అర్పించింది.

‘భారత అంతరిక్ష పితామహుడిగా పిలిచే విక్రమ్‌సారాభాయితో కలిసి రావు కెరీర్‌ ప్రారంభించారు. అంతరిక్ష రంగంలో గొప్ప సేవలు అందించి తనదైన ముద్ర వేసుకున్నారు. డాక్టరేట్‌ పూర్తి చేసుకున్న తర్వాత అమెరికా వెళ్లి అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం(నాసా)లో పయనీర్‌, ఎక్స్‌ప్లోరర్‌ ప్రయోగాల్లోనూ గొప్ప సేవలు అందించారు’ అని గూగుల్‌ గుర్తు చేసింది.

ప్రొఫెసర్‌ రామచంద్రరావు కర్ణాటకలోని ఉడుపి గ్రామంలో 1932లో జన్మించారు. మొదట కాస్మిక్‌ కిరణాలకు సంబంధించిన భౌతిక శాస్త్రజ్ఞుడిగా కెరీర్‌ ప్రారంభించారు. డాక్టరేట్‌ పూర్తి చేసిన తర్వాత కొన్నాళ్లు నాసాలో సేవలందించిన ఆయన.. 1966లో స్వదేశానికి తిరిగి వచ్చి.. 1975లో భారత తొలి ఉపగ్రహ ప్రయోగానికి నేతృత్వం వహించారు. ఆయన రూపొందించిన 20 ఉపగ్రహాల్లో ‘ఆర్యభట్ట’ కూడా ఒకటి. ఆర్యభట్ట కమ్యూనికేషన్‌, వాతావరణ సమాచారాన్ని అందించడం ద్వారా.. గ్రామీణ భారతంలో ఎన్నో మార్పులు తెచ్చింది. కాగా, రావుకు తెలుగు రాష్ట్రాలతో మంచి అనుబంధం ఉంది. తన డిగ్రీ విద్యాభ్యాసం అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో పూర్తి చేయడం విశేషం. ఈయన 2017లో మరణించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని