Vande Bharat Express: సికింద్రాబాద్‌ - తిరుపతి ‘వందే భారత్‌’ రైలులో టికెట్‌ ధరలివే..!

Vande Bharat Express: సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్‌ రైలును ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నుంచి ప్రారంభించనున్నారు.

Updated : 07 Apr 2023 22:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat Express)రైలు పట్టాలెక్కేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సెమీ హైస్పీడ్‌ రైలును ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సికింద్రాబాద్‌ నుంచి శనివారం పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. అత్యాధునిక హంగులు.. విమాన తరహా ప్రయాణ అనుభూతిని కలిగించే  ఈ రైలు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు  స్టేషన్లలో ఆగుతుందని ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. సికింద్రాబాద్‌ - తిరుపతి మధ్య నడిచే (20701) రైలు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఉదయం 6గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2.30గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అలాగే, తిరుపతి - సికింద్రాబాద్‌ (20702) రైలు తిరుపతి రైల్వేస్టేషన్‌ నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరి రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోనుంది. మంగళవారం మినహా మిగిలిన రోజుల్లో ఈ రైలు సేవలందిస్తుంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ఈ రైలులో టికెట్ల ధరలను పరిశీలిస్తే..

సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి ఏసీ ఛైర్‌కార్‌ టికెట్‌ ధర రూ.1680, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ టికెట్‌ ధరను రూ.3080లుగా నిర్ణయించారు. అదే, తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ఏసీ ఛైర్‌కార్‌ టికెట్‌ ధర రూ.1625, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ టికెట్‌ ధరను రూ.3030లుగా పేర్కొన్నారు. ఈ రెండు ధరల్లో స్వల్ప వ్యత్యాసం గమనించవచ్చు.  సికింద్రాబాద్‌-తిరుపతి టికెట్‌ ధరలను పరిశీలిస్తే బేస్‌ ఫేర్‌ రూ.1168గా నిర్ణయించారు. రిజర్వేషన్‌ ఛార్జీ రూ.40, సూపర్‌ ఫాస్ట్‌ ఛార్జీ రూ.45,  మొత్తం జీఎస్టీ రూ.63గా పేర్కొన్నారు. రైల్లో సరఫరా చేసే ఆహార పదార్థాలకు గానూ రూ.364 చొప్పున ఒక్కో ప్రయాణికుడి నుంచి క్యాటరింగ్‌ ఛార్జీ వసూలు చేయనున్నారు. అదే తిరుపతి- సికింద్రాబాద్ రైల్లో బేస్‌ ఛార్జీని రూ.1169గా పేర్కొన్నారు. కేటరింగ్‌ ఛార్జీని మాత్రం రూ.308గా పేర్కొన్నారు. దీంతో అప్‌ అండ్‌ డౌన్‌ ఛార్జీల్లో వ్యత్యాసం నెలకొంది.ఈ ఛార్జీలకు టికెట్‌ బుకింగ్‌ కన్వీనియెన్స్‌ ఛార్జీలు అదనంగా ఉంటాయి. 

సికింద్రాబాద్‌ నుంచి ఒక్కో స్టేషన్‌కు ఛార్జీలు ఇలా..

ఛైర్‌ కార్‌

సికింద్రాబాద్ నుంచి నల్గొండ - రూ.470

సికింద్రాబాద్ నుంచి గుంటూరు - రూ.865

సికింద్రాబాద్ నుంచి ఒంగోలు - రూ.1075

సికింద్రాబాద్ నుంచి నెల్లూరు - రూ.1270

సికింద్రాబాద్ నుంచి తిరుపతి - రూ.1680

ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ ఛార్జీలు

సికింద్రాబాద్ నుంచి నల్గొండ - రూ.900

సికింద్రాబాద్ నుంచి గుంటూరు - రూ.1620

సికింద్రాబాద్ నుంచి ఒంగోలు - రూ.2045

సికింద్రాబాద్ నుంచి నెల్లూరు - రూ.2455,

సికింద్రాబాద్ నుంచి తిరుపతి - రూ.3080

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని