TSPSC: ముగిసిన డీఈ రమేష్‌ రెండో రోజు విచారణ.. ప్రిన్సిపల్‌ అలీ గురించి ఆరా!

నిందితుడు డీఈ రమేష్‌ రెండో రోజు సిట్‌ విచారణ ముగిసింది. మాస్‌ కాపీయింగ్ చేయడానికి రమేష్‌కు సహకరించిన ఓ ప్రైవేట్‌ కళాశాల ప్రిన్సిపల్‌ గురించి సిట్‌ అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది.

Updated : 05 Jun 2023 20:13 IST

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితుడిగా ఉన్న డీఈ రమేష్‌ను సిట్ అధికారులు రెండో రోజు విచారించారు. ప్రశ్నపత్రాల లీకేజీతో పాటు హైటెక్ మాస్ కాపీయింగ్‌కు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. మాస్‌ కాపీయింగ్‌కు సహకరించిన ఓ ప్రైవేటు కళాశాల ప్రిన్సిపల్‌ అలీ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్రిన్సిపల్‌ అలీ పరారీలో ఉన్నాడు.

టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన డీఏవో, ఏఈఈ పరీక్షల్లో హైటెక్ మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన డీఈ రమేష్.. దాదాపు ఏడుగురు అభ్యర్థులకు జవాబులు అందించాడు. దీనికోసం ముందే పరీక్షా కేంద్రం నిర్వాహకుడిని బుట్టలోకి దింపాడు. టోలిచౌకీలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న అలీతో పరిచయం పెంచుకొని ప్రశ్నపత్రాన్ని తెప్పించుకున్నాడు. ఆ తర్వాత సంబంధిత సమాధానాలను అభ్యర్థులకు చెప్పాడు. దీనికోసం బ్లూటూత్ పరికరాలను అభ్యర్థులకు ముందే సమకూర్చాడు. ఒక్కో అభ్యర్థితో రూ. 30లక్షల ఒప్పందం కుదుర్చుకున్నట్లు సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఆ తర్వాత టీఎస్‌పీఎస్సీ మాజీ ఉద్యోగి సురేష్‌తో ఉన్న పరిచయం ఆధారంగా ఏఈ ప్రశ్నపత్రాన్ని తీసుకున్నాడు. వాటిని దాదాపు 80మందికి విక్రయించినట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను డీఈ రమేష్ వద్ద ప్రస్తావించి సమాచారం సేకరించినట్లు సమాచారం. డీఈ రమేష్ మరో నాలుగు రోజుల పాటు సిట్‌ కస్టడీలో ఉండనున్నాడు. ఈక్రమంలో రమేష్‌ను పూర్తిస్థాయిలో విచారించి సమాచారం సేకరించాలని సిట్ అధికారులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని