స్వల్ప స్వరంతో మాట్లాడినా.. వైరస్‌ వ్యాప్తి!

వైరస్‌ సోకిన వారు స్వల్ప స్వరంతో మాట్లాడినా ఎదుటివారికి వైరస్‌ సోకే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది.

Published : 25 Feb 2021 01:53 IST

మాస్కులతో కట్టడి చేయవచ్చంటున్న నిపుణులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ అత్యధిక వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. కేవలం లక్షణాలు ఉన్న వారి నుంచే కాకుండా లక్షణాలు కనిపించని రోగులు తుమ్మడం, దగ్గినప్పుడు వారి నుంచి వైరస్‌ వ్యాపిస్తుందని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో వైరస్‌ సోకిన వారు స్వల్ప స్వరంతో మాట్లాడినా ఎదుటివారికి వైరస్‌ సోకే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. మాస్కులు ధరించడం వల్ల ఈ ప్రమాదాన్ని సాధ్యమైనంత వరకు అరికట్టవచ్చని జపాన్‌ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

కరోనా వైరస్‌ నిర్ధారణ అయిన వ్యక్తి నుంచి వైరస్‌ ఎలా వ్యాపిస్తుందనే విషయాన్ని తెలుసుకునేందుకు జపాన్‌ శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు. పరిశోధనలో భాగంగా హెయిర్‌ సెలూన్‌, వైద్యపరీక్షలు జరిపే గదుల్లో వ్యక్తులు కూర్చునే విధంగానే ఇరువురిని ఓ ప్రదేశంలో కూర్చోబెట్టారు. వైరస్‌ కణాల మాదిరిగా ఉండే వాటికోసం ఎలక్ట్రానిక్‌ సిగరెట్‌ను ఉపయోగించారు. వారు మాట్లాడుతున్నప్పుడు వచ్చే పొగ వెళ్లే మార్గాన్ని లేజర్‌ లైట్‌ సహాయంతో విశ్లేషించారు. ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ సమయంలో వెలుబడే తుంపరుల గమనాన్ని కూడా గుర్తించారు. వైరస్‌ సోకిన వ్యక్తి మాస్కు ధరించని పక్షంలో అతను మాట్లాడినప్పుడు వెలుబడే తుంపరులు ఎదుటివారిపై పడే అవకాశం ఉందని కనుగొన్నారు. కొన్ని సమయాల్లో అతి దగ్గరగా ఉన్నప్పటికీ మాస్కు ధరించడం వల్ల తుంపరులు ఎదుటివారిపై పడే అవకాశాలు తక్కువగానే ఉంటాయని పేర్కొన్నారు. ఇలా మాస్కు, ఫేస్‌షీల్డ్‌ వంటివి ధరించడం వల్ల కరోనా వైరస్‌ వ్యాప్తిని సాధ్యమైనంత వరకు తగ్గించవచ్చని జపాన్‌ పరిశోధకులు సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని