Mallu Swarajyam: 16 ఏళ్లకే తుపాకీ చేతపట్టి.. దొరల గుండెలపై గురిపెట్టి!
ఆమె ఓ భూస్వామి బిడ్డ. పెద్ద బంగళా పనిమనుషులూ.. కోరుకున్నంత వైభోగం. కానీ ‘బాంచన్ దొరా’ బతుకులు ఆమెను కలచివేశాయి. ఆస్తిపాస్తులన్నీ ......
ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం: ఆమె ఓ భూస్వామి బిడ్డ. పెద్ద బంగళా.. పనిమనుషులూ.. కోరుకున్నంత వైభోగం. కానీ ‘బాంచన్ దొరా’ బతుకులు ఆమెను కలచివేశాయి. ఆస్తిపాస్తులన్నీ వదులుకొని పోరుబాట పట్టారు. గడీలలో నిజాం పాలకుల అకృత్యాలకు నిరసనగా గళమెత్తారు. అసహాయులకు అండగా నిలిచేందుకు ఆయుధం పట్టారు. సంసారాన్ని లాగేందుకూ.. ప్రజాప్రతినిధిగా పేదలకు సాయం చేసేందుకూ మళ్లీ పోరాటమే! మొత్తం తన జీవితాన్నే పోరాటంగా శ్వాసించిన వీర వనిత, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూశారు. సాహసమే ఊపిరిగా కొనసాగిన ఈ ‘ఎర్ర మందారం’ జీవిత ప్రస్థానం మీకోసం..
(మల్లు స్వరాజ్యం)
‘అమ్మ’ తెచ్చిన ప్రేరణతోనే పోరుబాట!
మల్లు స్వరాజ్యం.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ, సామాజిక రంగాల్లో ఈ పేరు తెలియనివారు ఉండకపోవచ్చు. దేశంలోని చరిత్రకారులకు మల్లు స్వరాజ్యం పేరు సుపరిచితమే. భూస్వామ్య కుటుంబంలో పుట్టిన స్వరాజ్యం.. పదేళ్ల ప్రాయంలోనే మాగ్జిం గోర్కీ 'అమ్మ' నవల ప్రేరణతో ఆనాటి సామాజిక దురాచారాలపై పిడికిలి బిగించి కదనరంగంలో దూకిన వీరవనిత. హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలనలో దొరలకు, రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా భూమికోసం, భుక్తికోసం తెలంగాణ విముక్తి కోసం జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించారు. 8 దశాబ్దాల కిందట ఎర్రజెండాతో పెనవేసుకున్న ఆమె జీవితం కడదాకా పోరాట స్ఫూర్తితోనే కొనసాగింది.
(కేరళ సీఎం పినరయి విజయన్తో..)
ప్రస్తుత సూర్యాపేట జిల్లా (ఉమ్మడి నల్లగొండ జిల్లా)లోని కర్విరాల కొత్తగూడెంలో మల్లు స్వరాజ్యం జన్మించారు. 1931లో భూస్వామ్య కుటుంబంలో పుట్టిన ఆమె ఐదో తరగతి వరకే చదివారు. తన సోదరుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి, భర్త మల్లు వెంకట నర్సింహారెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ పోరాట మార్గంలో అలుపెరగని పయనం చేశారు. ఆంధ్ర మహాసభ కార్యకలాపాల చైతన్యంతో నాటి నిజాం పాలనా వ్యవస్థలో దొరల ఫ్యూడల్ దాష్టీకాలకు వ్యతిరేకంగా మొదలైన సాయుధ పోరాట బాట పట్టిన భీమిరెడ్డి నర్సింహారెడ్డి ప్రభావం ఆమెపై ఎంతో ఉంది. 1941లో తొలిసారిగా ఆంధ్రమహాసభ పిలుపుతో తన కుటుంబానికి చెందిన భూముల్లోని ధాన్యం నిరుపేద కుటుంబాలకు పంచిపెట్టారామె. కార్మికుల వేతనాలు గురించి, మహిళలు, రైతాంగ సమస్యలపై రాజీలేని పోరు కొనసాగించారు. ఆనాటి సామాజిక కట్టుబాట్లను ధిక్కరిస్తూ వివిధ వర్గాల పీడిత ప్రజలకు మద్దతుగా నిలిచే విషయంలో తన తల్లి భీమిరెడ్డి చొక్కమ్మ అండగా నిలవడంతో తను ఇక వెనక్కి తిరిగి చూడలేదు. తన సోదరుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి ప్రోద్బలంతో హైదరాబాద్ సంస్థానంలో ఫ్యూడల్ బానిసత్వంపై తిరుగుబావుటా ఎగురవేసి తెలంగాణ సాయుధ పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించారు.
(పార్టీ మహాసభల్లో ఎర్రజెండా ఎగురవేస్తూ..)
ఆమెను పట్టిస్తే.. రూ.10వేలు నజరానా!
1945 నుంచి 1948 వరకు మహోజ్వలంగా సాగిన తెలంగాణ సాయుధపోరాటంలో తుపాకీ చేతబట్టిన స్వరాజ్యం ఎందరో మహిళలకు ప్రేరణగా నిలిచారు. గ్రామాల్లో భారీగా ప్రజలను కదిలించేలా సభలు, సమావేశాలు ఏర్పాటు చేశారు. రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా బతుకమ్మ పాటలతో ఉర్రూతలూగించే ఉపన్యాసాలతో మహిళలను చైతన్యపరచడంలో కీలక పాత్ర పోషించారు. సాయుధ పోరాట కాలంలో మల్లు స్వరాజ్యంతో పాటు మూడు వందల మంది మహిళలు మేజర్ జైపాల్ సింగ్ ఆధ్వర్యంలో సాయుధ శిక్షణ పొందారు. నిజాం పాలనకు, ఫ్యూడల్ దొరతనానికి పక్కలో బల్లెంలా ఉన్న మల్లు స్వరాజ్యం, భీమిరెడ్డి నర్సింహారెడ్డిలపై ఆగ్రహంతో రజాకార్ మూకలు 1947లో కరివిరాల కొత్తగూడెంలో వారి ఇంటిని తగలబెట్టారు. అదే సమయంలో అజ్ఞాతంలో ఉన్న స్వరాజ్యాన్ని పట్టిస్తే రూ.10వేలు నజరానాను నిజాం ప్రభుత్వం ప్రకటించింది. అప్పుడు ఆమె వయస్సు నిండా 18 ఏళ్లు కూడా లేవు. కమ్యూనిస్టు పార్టీ ఆదేశాల మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉద్యమంలో పనిచేసిన స్వరాజ్యం.. ఆ క్రమంలోనే గిరిజనగూడేల్లో ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైనా ఉద్యమించారు.
నన్ను కాల్చుతావా.. కాల్చు!
ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ చీలిక అనంతరం మల్లు స్వరాజ్యం సీపీఎం పక్షాన నిలిచారు. సాయుధ పోరాట కాలంలో రాజక్క అనే పేరుతో పనిచేసిన ఆమె, ఆ ఉద్యమ కాలంలో పనిచేసిన నూతనకల్ మండలం మామిళ్ల మడవ గ్రామానికి చెందిన మల్లు వెంకట నర్సింహారెడ్డిని వివాహం చేసుకున్నారు. సాయుధ పోరాటం విరమణ తర్వాత కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆమెకు దొరలతో పోరాటం తప్పలేదు. పేద రైతులు, కూలీల పక్షాన నల్లగొండ జిల్లాలోని బడా భూస్వామ్య శక్తులు, దొరల రాజకీయాలకు అరాచకాలకు ఎదురొడ్డి నిరంతరం పోరాడాల్సిన పరిస్థితులను ఆమె ఎదుర్కొన్నారు. పీడిత ప్రజల మీద ఏ ప్రాంతంలో దాడులు దౌర్జన్యాలు జరిగినా, ప్రత్యక్షంగా రంగంలోకి దిగి బాధితుల పక్షాన స్వరాజ్యం నిలబడ్డారు. ప్రస్తుతం మండల కేంద్రంగా ఉన్న నాగారంలో ఆనాడు ఎన్నికల పోలింగ్ సందర్భంగా ప్రత్యర్థి పార్టీ వారు ఓటర్లలో భయాందోళనలు సృష్టిస్తుంటే తను అక్కడికి చేరుకున్న ఆమెతో ఆనాటి అధికార పార్టీకి చెందిన ఓ నేత వాగ్వాదానికి దిగారు. తన పిస్టల్ గురిపెట్టి బెదిరించబోయారు. ఈ హఠాత్పరిణామానికి ప్రజలు నివ్వెరపోగా.. ఊహించని ఈ ఘటనలో ఆమె ఏమాత్రం వెరవకుండా 'కాల్చుతావా, కాల్చు...' అంటూ ఎదురునిలిచారు. దీంతో ఆ నేత వెనక్కి తగ్గక తప్పలేదు.
(ప్రకాశ్ కారాట్, చుక్కా రామయ్య తదితరులకు విప్లవ వందనం చేస్తూ..)
కడదాకా ఎర్రజెండాతోనే..
పదహారేళ్ల ప్రాయంలోనే సాయుధ పోరాట పంథాలో అడుగుపెట్టినప్పట్నుంచి 91ఏళ్ల వయోభారంలోనూ నిరంతరం ఆమె పీడిత ప్రజల కోసమే పనిచేశారు. పార్టీ సభలు, సమావేశాల్లో వాడీ వేడిగా సాగే ఆమె ప్రసంగాలంటే పార్టీ శ్రేణులతో పాటు సాధారణ ప్రజానీకం ఎంతో ఆసక్తిగా ఆలకించేవారు. తన 75 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రజాప్రస్థానంలో ఆమె రెండు సార్లు తుంగతుర్తి శాసనసభ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అఖిల భారత మహిళా సంఘం (ఐద్వా) నాయకురాలిగా అనేక మహిళా సమస్యలపై పోరాడారు. అసెంబ్లీలో ఉన్న సమయంలో శ్రామిక వర్గాల సమస్యలపై గళం వినిపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు